ETV Bharat / state

వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

author img

By

Published : Oct 15, 2020, 12:59 PM IST

హైదరాబాద్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలక, వైద్య-ఆరోగ్య, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. నగరంలో పలుచోట్ల నీరు నిల్వ ఉన్న కాలనీల్లో సహాయక చర్యలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని సీఎస్ వివరించారు.

minister ktr review on Hyderabad floods
మంత్రి కేటీఆర్ సమీక్ష

వర్షాలు, వరదలతో భాగ్యనగర ప్రజలు బెంబేలెత్తవద్దని, ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. ఆ దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నీళ్లు వెళ్లిపోయిన కాలనీలు, ఇళ్లలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ దిశగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ విభాగం ద్వారా కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా శానిటైజేషన్ చేయాలని, రసాయనాలు పిచికారీ చేయాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్... మరి కొన్నాళ్ల పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా అప్రమత్తం చేయాలని అధికారులకు చెప్పారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కాలనీల్లో జీహెచ్ఎంసీ కేంద్రాలు, 104 వాహనాల ద్వారా తక్షణం వైద్య సాయం అందించాలని, ఇందుకు అవసరమైన వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వరద ప్రభావం నుంచి బయటకు వచ్చిన ప్రజలు, తాగునీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని మంత్రి సూచించారు.

బుధవారం నుంచి నగర వ్యాప్తంగా సుమారు యాభై వేల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. ఇవాళ కూడా అక్షయపాత్ర సాయంతో ఐదు రూపాయల భోజనం, ఉచిత ఆహార పొట్లాల పంపిణీ కొనసాగుతుందని వివరించారు. నగరంలో వరద ప్రభావం అంచనా వేసేందుకు వివిధ శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ కలిసి పనిచేయాలన్న కేటీఆర్.. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశం వరకు అన్ని వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

పాతభవనాలు, అపార్టుమెంట్ సెల్లార్లు, నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద నీటిని తొలగించే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువుల వద్ద ముందస్తు చర్యల కోసం సాగునీటి శాఖ అధికారుల సాయం తీసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో వర్షాలవల్ల ఎదురైన పరిస్థితులపై నివేదిక అందించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.