ETV Bharat / state

Ktr France tour: డిజిటల్‌ సాంకేతికతలో అద్భుతాలు.. ఫ్రాన్స్, తెలంగాణ పరస్పర సహకారం

author img

By

Published : Oct 28, 2021, 4:48 AM IST

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తొలి రోజు కీలక భేటీల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఫ్రెంచ్‌ ప్రభుత్వ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఇన్నోవేషన్‌, డిజిటలైజేషన్‌, ఓపెన్‌ డేటాపై వారితో చర్చించారు. పరస్పర సహకారం అందించుకునే అవకాశాలపై ప్రధానంగా చర్చించారు.

minister ktr meet france investers in his tour
minister ktr meet france investers in his tour

డిజిటల్‌ సాంకేతికతలో తెలంగాణ అద్భుతాలు సాధిస్తోందని, పరిపాలన, ప్రజాసేవల్లో దానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. కృత్రిమమేధ, ఓపెన్‌డేటా, బ్లాక్‌చైన్‌ వంటి నవీన సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తోందని తెలిపారు. నాలుగు రోజుల ఫ్రాన్స్‌ పర్యటన కోసం బుధవారం ఆ దేశ రాజధాని పారిస్‌ చేరుకున్న ఆయన.. తొలిరోజే అక్కడి ప్రభుత్వ డిజిటల్‌ వ్యవహారాల రాయబారి హెన్రీ వెర్డియర్‌తో సమావేశమయ్యారు. సమావేశంలో భారత డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ కేఎం ప్రఫుల్లచంద్ర శర్మ, తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, డిజిటల్‌ మీడియా, వైమానిక విభాగం సంచాలకులు కొణతం దిలీప్‌, ప్రవీణ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలంగాణలో డిజిటల్‌ సాంకేతికత, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ డిజిటల్‌ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల గురించి వెల్లడించారు. రాష్ట్రంలో ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, ఓపెన్‌ డేటా విధానాన్ని కేటీఆర్‌ వివరించారు. ఆవిర్భవించిన అనతికాలంలో తెలంగాణ గొప్ప సాంకేతిక ప్రగతిని సాధించడం అభినందనీయమని ఈ సందర్భంగా వెర్డియర్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌, వెర్డియర్‌లు డిజిటలీకరణ, ఓపెన్‌డేటా, ఆవిష్కరణల రంగాల్లో ఫ్రాన్స్‌, తెలంగాణ మధ్య పరస్పర సహకారానికి అంగీకరించారు. తెలంగాణ అంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఆ దేశంలోని అంకుర సంస్థలకు తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపార, వాణిజ్య అవకాశాల కల్పనకు నిర్ణయించారు.

నేడు మరిన్ని భేటీలు

ఫ్రాన్స్‌ చేరుకున్న కేటీఆర్‌ బృందానికి పారిస్‌ విమానాశ్రయం ఫ్రెంచ్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌ ఇతర అధికారులు స్వాగతం పలికారు. పారిస్‌లోని ప్రభుత్వ వసతిగృహంలో కేటీఆర్‌ బృందం బస చేసింది. గంట వ్యవధిలో డిజిటల్‌ వ్యవహారాల రాయబారి వెర్డియర్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. గురువారం సైతం ఆయన పలువురు ప్రముఖులు, సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పారిస్‌లోని వాగిరార్డ్‌ వీధిలో గల ఫ్రెంచ్‌ సెనేట్‌లో ప్రారంభమయ్యే ‘భారత ఆశయం’ (యాంబిషన్‌ ఇండియా) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ దీనిని ప్రారంభిస్తారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, ఇరు దేశాల రాయబారులు, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌, ప్రసిద్ధ సంస్థల సీఈవోలు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంఘాల ప్రతినిధులు, నిపుణులు ఇందులో పాల్గొంటారు. సదస్సులో ‘‘కరోనా అనంతరం భారత-ఫ్రెంచ్‌ సంబంధాల్లో పురోగతి’’ అంశంపై కేటీఆర్‌ కీలకోపన్యాసం చేస్తారు. సదస్సు ముగిసిన తర్వాత వాణిజ్యవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. తొలిరోజు నాలుగు సంస్థల అధిపతులతో కేటీఆర్‌ భేటీ అవుతారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు ఇతర అంశాలపై ఆయన దృశ్యరూపక ప్రదర్శన (పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌) ఇస్తారు. అనంతరం చర్చలు జరుపుతారు.

ఇదీ చూడండి:

KTR France Tour: ఫ్రాన్స్‌ పర్యటనలో.. మంత్రి కేటీఆర్‌ బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.