'గృహలక్ష్మి పథకం' కింద మూడు విడతల్లో రూ.3 లక్షలు: మంత్రి హరీశ్‌రావు

author img

By

Published : Mar 9, 2023, 8:09 PM IST

Updated : Mar 9, 2023, 9:18 PM IST

harish rao
harish rao ()

హామీల అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పేదలు, బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులకు లబ్ధి జరిగేలా ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు, పోడు పట్టాల పంపిణీకి నిర్ణయించింది. 58, 59 జీవోల కటాఫ్ తేదీని 2020కి పొడిగించడంతో పాటు దరఖాస్తుకు మరో నెల రోజుల పాటు గడువిచ్చింది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి రోజున అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హుజూరాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో 1,100 మంది చొప్పున మొత్తం లక్షా 30 వేల మందికి దళితబంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రతి ఏటా ఆగస్టు 16న దళితబంధు వేడుకలు చేయాలని తీర్మానించారు. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి గృహ లక్ష్మి పథకం అమలు చేయాలని నిర్ణయించిన మంత్రివర్గం.. నియోజకవర్గానికి 3,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. రూ.3 లక్షల గ్రాంటుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 3 విడతల్లో జమ చేయనున్నారు.

''ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పథకానికి గృహలక్ష్మి పథకంగా పేరు పెడుతున్నాం. గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తాం. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలను మూడు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించాం. గృహ నిర్మాణ సంస్థ ద్వారా గతంలో నిర్మించుకున్న ఇళ్ల అప్పులను రద్దు చేస్తున్నాం.'' - హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరిస్తాం..: గతంలో ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు రుణంగా ఇచ్చిన రూ.4,000 కోట్ల రుణాల మొత్తాన్ని మాఫీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. నిర్మాణం పూర్తైన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపింది. ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు కొనసాగుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 58, 59 ఉత్తర్వుల కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కటాఫ్ తేదీని 2020 వరకు పొడిగించడంతో పాటు దరఖాస్తుకు మరో నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని నిర్ణయించారు.

ఏప్రిల్‌ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ..: రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని నిర్ణయించిన కేబినెట్.. మిగిలిన సగం మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి ఆగస్టులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా సాగాలని స్పష్టం చేసింది. పోడు భూముల పట్టాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం.. 4 లక్షలకుపైగా ఎకరాలకు సంబంధించి లక్షా 55 వేలకు పైగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. మిగిలిన వారి దరఖాస్తుల పరిశీలన, పట్టాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.

కాశీ, శబరిమలలో అతిథి గృహాలు..: రాష్ట్ర యాత్రికుల కోసం కాశీలో రూ.25 కోట్ల వ్యయంతో అతిథి గృహం నిర్మించాలని, శబరిమలలోనూ రూ.25 కోట్ల వ్యయంతో అతిథి గృహం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మిస్తున్న 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని.. రాష్ట్రవ్యాప్తంగా దళితులను సమీకరించి బహిరంగ సభ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

''తెలంగాణ నుంచి కాశీ, శబరిమలలకు ప్రజలు పెద్దఎత్తున వెళ్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ రెండు చోట్ల వసతి గృహాలు నిర్మించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించాం.'' - మంత్రి హరీశ్‌రావు

జూన్‌ 2లోగా సచివాలయం ప్రారంభం..: తుది దశలో ఉన్న నిర్మాణాలు సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని కూడా జూన్ రెండో తేదీలోగా ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. కేంద్రం తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రతి గింజనూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ నెలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆ అంచనా వ్యయానికి ఆమోద ముద్ర..: ఈ క్రమంలోనే గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ పనుల సవరించిన అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

'గృహలక్ష్మి పథకం' కింద మూడు విడతల్లో రూ.3 లక్షలు: మంత్రి హరీశ్‌రావు

ఇవీ చూడండి..

రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఆ అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం!

ప్రయాణికులకు గుడ్​న్యూస్.. రూ.300కే టీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ టికెట్

Last Updated :Mar 9, 2023, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.