ETV Bharat / state

బీజేపీకి తెలిసింది.. అదొక్కటే: అసెంబ్లీలో హరీశ్ రావు ఫైర్

author img

By

Published : Feb 8, 2023, 3:27 PM IST

Updated : Feb 8, 2023, 5:38 PM IST

Telangana Budget Sessions 2023-24 : మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వంపై అసెంబ్లీ సమావేశాల్లో మండిపడ్డారు. ఇక ఈటల రాజేందర్‌పై కూడా మంత్రి హరీశ్ చురకలు వేశారు. నిండుపున్నమిలో వెన్నెల వెలుగులు చూడకుండా చందమామలో మచ్చలు చూస్తున్నారని.. ఈటలను ఎద్దేవా చేశారు.

Telangana Budget Sessions 2023-24
బీజేపీకి తెలిసింది.. అదొక్కటే: అసెంబ్లీలో హరీశ్ రావు ఫైర్

బీజేపీకి తెలిసింది.. అదొక్కటే: అసెంబ్లీలో హరీశ్ రావు ఫైర్

Telangana Budget Sessions 2023-24: మిషన్‌ భగీరథ పథకం రూపంలో దేశం ముందు ఒక నమూనా నిలిపామని మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో తెలిపారు. తెలంగాణను చూసి కేంద్రం ప్రారంభించిన హర్‌ ఘర్‌ జల్‌ పథకం సవ్యంగా సాగటం లేదన్నారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందన్నారు. అమృత్‌కాల్‌ అని చెప్తున్న బీజేపీ పాలన దేశ ప్రజలకు ఆపద కాలం వస్తోందని విమర్శించారు. గోదావరి జలాలను 600 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత ఈ సర్కారుది అని వెల్లడించారు. ప్రపంచమే ఆశ్చర్యపడే కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే నిర్మించామన్నారు. చనిపోయిన వ్యక్తుల పేరు మీద కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని వెల్లడించారు.

''ఈటల నిండుపున్నమిలో వెన్నెల వెలుగులు చూడకుండా చందమామలో మచ్చలు చూస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఏమీ చేయొద్దన్నట్లుగా విపక్ష నేతలు మాట్లాడుతున్నారు. గతంలో బడ్జెట్‌ సమావేశాలప్పుడు నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవారు. విద్యుత్‌ కోతలను నిరసిస్తూ తరచూ నిరసన ప్రదర్శనలు జరిగేవి. గతంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించాలంటే భయపడాల్సిన పరిస్థితి. బిందెడు నీటి కోసం మహిళలు మైళ్ల దూరం నడిచేవారు. నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్‌ నీటి వల్ల ఎముకలు వంకర్లు పోయి బాధపడేవారు. ప్రజల గుండెల మీద ఫ్లోరైడ్‌ బండలు తొలగించిందెవరు?'' - హరీశ్‌రావు, మంత్రి

ప్రజలకు కావల్సినంత పవర్ ఇచ్చినందుకే ప్రజలు తమకు పవర్‌ ఇచ్చారన్నారు. ప్రజలకు మేం నిరంతరం పవర్‌ ఇస్తాం, ప్రజలు కూడా ఎప్పటికీ తమకే పవర్‌ ఇస్తారని వెల్లడించారు. పవర్‌ హాలీడే ఇచ్చారు కాబట్టే కాంగ్రెస్‌ పవర్‌కు ప్రజలు హాలిడే ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సరిపడా నీళ్లు, నిధులు ఇస్తోందని రైతులు సంబరపడుతున్నారని వెల్లడించారు. వాళ్లకు ఎప్పటికీ పవర్‌ రానట్లుందని విపక్షాలకు బాధ కల్గుతోందని తెలిపారు.

ఏ పని ప్రారంభించినా సీఎం కేసీఆర్‌ దేవుడికే మొక్కుకుంటారని వెల్లడించారు. కొత్త జిల్లాలకు దేవుడి పేర్లు పెట్టారన్నారు. బ్యారేజీలకు కూడా దేవుళ్ల పేర్లు పెట్టారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ గోపూజలు చేసినా... తాంత్రిక పూజలు అని దుర్భాషలాడుతున్నారని వెల్లడించారు. దేవుడిపట్ల ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నప్పటికీ తాము ఎప్పుడూ మతాల పేరుతో రెచ్చగొట్టలేదన్నారు.

''యూనివర్సిటీల్లో తాంత్రిక పూజల కోర్సు అమలు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్తోంది. రైతుల ఇళ్లకు విద్యుత్‌ బిల్లులు పంపాలని కేంద్రం అంటోంది. కేంద్రం చెప్పినట్లు చేస్తే రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల నిధులు వస్తాయి. సీఎం కేసీఆర్‌ మాత్రం 65 లక్షల మంది రైతుల గురించే ఆలోచించారు. రూ.30 వేల కోట్లు రాకపోయినా సరే అని రైతుల పక్షాన నిలబడ్డారు.రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని కేంద్రానికి చెప్పారు. గుజరాత్‌లో ఛార్జీలు వసూలు చేస్తూ విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. భాజపాకు తెలిసింది.. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం మాత్రమే'' - హరీశ్‌రావు, మంత్రి

ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తున్నామన్న హరీశ్‌ రావు.. రాష్ట్రంలో 21.50 లక్షల మంది ఆరోగ్య శ్రీ కింద లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రతి లక్షకు మాతృ మరణాలను 43కి తగ్గించామన్నారు. మాతృ మరణాల తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి పెట్టిన లక్ష్యం 70 అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో 30.5 శాతం కాన్పులు అయ్యేవని తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు 60 శాతానికి చేరుకున్నాయన్నారు.

వరంగల్‌లో అతిపెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రి దసరా నాటికి వస్తుంది. రాష్ట్రంలో మూడు నుంచి 104కు డయాలసిస్‌ కేంద్రాలు పెంచాం. ఇవేవి కాంగ్రెస్‌, భాజపా నాయకులకు కనపడదు... వినపడదు. ప్రభుత్వమే ప్రజల దగ్గకు వెళ్లి కంటి పరీక్షలు చేస్తోంది. విపక్షాలు కంటి వెలుగు పరీక్షలు చేసుకోవాలి... అప్పుడైనా వారికి అభివృద్ధి కనపడుతుంది. - మంత్రి హరీశ్‌రావు

ఇవీ చదవండి:

Last Updated :Feb 8, 2023, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.