ETV Bharat / state

కేసీఆర్ హామీలు సాకారం.. ఇదే నిదర్శనం : కేటీఆర్

author img

By

Published : Feb 1, 2023, 8:09 PM IST

Etv Bharat
Etv Bharat

Mana Uru Manabadi school inauguration in Telangana: 'మనఊరు మనబడి' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరమ్మతులు, పునర్నిర్మాణాలు పూర్తిచేసిన ప్రభుత్వ పాఠశాలల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఒకే రోజు హైదరాబాద్‌ తోపాటు జిల్లాల్లో మొత్తం 684 పాఠశాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కార్యాక్రమాన్ని చేపట్టినట్లు ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు.

కేసీఆర్ హామీలు సాకారం.. ఇదే నిదర్శనం : కేటీఆర్

Mana Uru Manabadi school inauguration in Telangana: రాష్ట్రవ్యాప్తంగా మనఊరు-మనబడి మొదటి విడత పనుల్లో ఆధునీకరించిన 684 పాఠశాలలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. 2014, సెప్టెంబరు 17న గంభీరావుపేటలో కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు కేజీ నుంచి పీజీ విద్యా సంస్థల ప్రాంగణం ఏర్పాటు సాధ్యమైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1200 పాఠశాలల్ని మెరుగుపర్చినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూడేళ్లలో మూడు దశల్లో రాష్ట్రంలోని 26 వేల 55 పాఠశాలల్లో 12 రకాల సదపాయాలు మెరుగు పరుస్తామని చెప్పారు. ఈ క్యాంపస్‌లో ఒకేసారి వెయ్యి మంది భోజనం చేసేలా అతి పెద్ద డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు.

ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు సాకారమయ్యాయి. ఇందుకు గంభీరావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ నిదర్శనం. ‘తెలంగాణ సిద్ధించిన తర్వాత కేజీ టు పీజీ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆయన ఇచ్చిన హామీ ప్రతి రూపమే కేజీ టు పీజీ క్యాంపస్. విద్యాపరంగా అభివృద్ధి చెందిన దేశాలే అభివృద్ధి సాధిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాం. - మంత్రి కేటీఆర్

దేశంలోని 28 రాష్ట్రాలలో చిన్న వయసు గల రాష్ట్రం తెలంగాణ... కానీ, ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జనహితమే అభిమతంగా అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. సీఎం గొప్ప సంస్కరణలు చేపట్టి, పాలన వికేంద్రీకరణతో పథకాలను ప్రజల చెంతకు చేర్చారని పేర్కొన్నారు.

విమర్శలు సులభమని మంచి పనులు చేసి పేద ప్రజల మనసు గెలుచుకోవడమే కష్టమని అన్నారు. గంభీరావుపేట కేజీ టు పీజీ విద్యా సంస్థల క్యాంపస్‎కు తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగంలో దేశంలో ఎక్కడా కూడా గంభీరావుపేట లాంటి కేజీ టు పీజీ క్యాంపస్ లేదు. గంభీరావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ తెలంగాణకే స్ఫూర్తిగా నిలుస్తుంది. మన ఊరు మనబడి కార్యక్రమంలో 12 కాంపోనెంట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని 7,300 కోట్లతో 26 వేల స్కూల్‌లను 3 విడతలలో అభివృద్ధి చేస్తున్నాం. తొలి విడతలో 3,509 కోట్లు 9 వేల స్కూళ్లు అభివృద్ధి జరుగుతుంది. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంతో మన ఊరు మన బడి కార్యక్రమం కింద పాఠశాలలలో డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సీఎం కేసిఆర్ దిశానిర్దేశంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నాం. - మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఈ కార్యక్రమంలో భాగంగా భవనాలకు మరమ్మతులు, రంగులు వేస్తున్నారు. ప్రహరీ గోడలు నిర్మించి, తాగునీరు సౌకర్యం కల్పిస్తున్నారు. మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. లైటింగ్, భోజన వసతి, గ్రీన్ బోర్డులు, డిజిటల్ తరగతుల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. మేడ్చల్‌ జిల్లా ప్రగతినగర్‌లో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా మరమ్మతులు, పునర్నిర్మాణాలు పూర్తిచేసిన పాఠశాలలను జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యే ప్రారంభించారు. హైదరాబాద్‌ నగరంలోని సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌ ల్లో జరిగిన ప్రారంభోత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. మేడ్చల్‌ జిల్లా పోచారం, మేడిపల్లి మండలాల్లో జరిగిన 'మనఊరు-మనబడి' కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.