ETV Bharat / state

Home Minister on Spurious Seeds : 'ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా చూడండి'

author img

By

Published : May 19, 2023, 5:47 PM IST

Updated : May 19, 2023, 6:45 PM IST

Home Minister on Spurious Seeds : ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు, మద్యం రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్‌ అలీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్‌, హోం శాఖ కార్యదర్శి జితేందర్‌, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Muhammad Ali
Muhammad Ali

Home Minister on Spurious Seeds : నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో హోం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ,డీజీపీ అంజనీ కుమార్ తదితర అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతోనూ, పోలీస్ కమిషనర్లతోను మాట్లాడారు. వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే అన్నారు.

ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు వ్యవసాయ శాఖ, ఇంటెలిజెన్స్ సిబ్బందితో సమాచారం సేకరించి నకిలీ విత్తన విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని హోం మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ప్రయోజన పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రుణాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా రైతుల జీవితాలలో వెలుగులు నింపుతున్న తరుణంలో వారు నకిలీ విత్తనాల విక్రయ దారుల బారిన పడకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఎన్నో విజయాలను సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఈ విషయంలోనూ పోలీసు అధికారులు వ్యవహరించి నకిలీ విత్తనాలను అరికట్టాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు రాష్ట్రంలోని రైతులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను హోం మంత్రి వివరించారు.

నకిలీ విత్తనాల అమ్మకాలపై 986 కేసులు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నకిలీ విత్తనాలు అమ్మకాలపై 986 కేసులను నమోదు చేశామన్నారు. వీటికి సంబంధించి 1938 నిందితులను అరెస్ట్ చేశామని, 58 మందిపై పీడీ యాక్ట్ బుక్ చేశామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయిదారులపై పీడీ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకున్నట్లయితే వారిని నియంత్రించవచ్చని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు నిరంతర అప్రమత్తత అవసరం అన్నారు .అదేవిధంగా, మద్యం ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అన్నారు.

వరంగల్‌ జిల్లాలో కల్తీ విత్తనాలపై విస్తృతంగా తనిఖీలు..: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్ హెచ్చరించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో టాస్క్ ఫోర్స్, ఎస్పీ, సివిల్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ కర్ణాకర్ మాట్లాడుతూ.. సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని.. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా.. మిల్లుల వద్ద త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా మిల్లర్లకు సూచించినట్లు డీసీపీ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 19, 2023, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.