ETV Bharat / state

Uppal Stadium: సమస్యల నిలయంగా ఉప్పల్‌ స్టేడియం

author img

By

Published : May 4, 2023, 12:17 PM IST

Lack of Facilities at Uppal Stadium: నాలుగేళ్ల క్రితం గాలివానకు ఎగిరిపోయిన క్యనోపి, పొట్లిపోయి పగిలిన కుర్చీలు.. నిండిపోయి దుర్వాసన వస్తున్న సెప్టిక్‌ ట్యాంకులు.. శౌచాలయాలు.. లీకవుతున్న నీటిపైపులు.. ప్రస్తుతం ఉప్పల్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం దుస్థితి. మ్యాచ్‌లను తిలకించేందుకు వేలకు వేలు వెచ్చించి... టికెట్లు కొంటున్న ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు అందించలేకపోతుంది హెచ్‌సీఏ. విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం.. ఇలానే కొనసాగితే త్వరలో జరగబోయే ప్రపంచకప్‌ మ్యాచ్‌లకి ఆతిథ్యమివ్వడం అనుమానమే.

Uppal Stadium
Uppal Stadium

సమస్యల నిలయంగా ఉప్పల్‌ స్టేడియం

Lack of Facilities at Uppal Stadium: ఉప్పల్‌ అంతార్జాతీయక్రికెట్‌ స్టేడియంను 2004లో.. అప్పటి సాంకేతికతకు అనుగుణంగా నిర్మించారు. సుమారు 50,000కు పైగా ప్రేక్షకులు వీక్షించేలా నిర్మాణం చేశారు. 2005 నవంబర్‌ 16న దక్షిణాఫ్రికాతో తొలివన్డే జరిగింది. చివరిగా ఈ జనవరి 18న.. న్యూజిల్యాండ్‌తో వన్డే నిర్వహించారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ప్రతి సీజన్‌లో ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. స్టేడియం నిర్మించి 17 ఏళ్లు దాటినా ఊహించినంత అభివృద్ధి జరగలేదు.

Uppal Stadium Issues : ఏటేటా మ్యాచ్‌ చూసేందుకు వచ్చే క్రికెట్‌ అభిమానుల సంఖ్య పెరుగుతున్నా సరైన సౌకర్యాలు లేవు. మంచినీరు లభించని పరిస్థితి. నిధులు సరిపోకవడం సహా హెచ్‌సీఏలో నెలకొన్న అంతర్గతపోరుతో స్టేడియం ఈ దుస్థితికి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే సీట్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఎండకుఎండి, వానకు తడిచి పొట్లిపోయి విరిగిపోయాయి. నాలుగేళ్ల విరామం తర్వాత గతేడాది ఆస్ట్రేలియా- భారత్‌ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ సమయంలోనూ చాలా సీట్లు ఊడిపోయాయి.

అప్పటికప్పుడు కొన్నింటిని తెప్పించి తాత్కాలికంగా సరిపెట్టారు. ఆ మ్యాచ్ తర్వాత ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు ఆజారుద్దీన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జనవరిలో న్యూజిల్యాండ్‌తో జరిగిన వన్డే సమయంలోనూ అదే పరిస్థితి. ఇటీవల అధ్యక్ష పదవీకాలం ముగియడంతో హెచ్‌సీఏ కార్యకలాపాలు సహాఎన్నికల నిర్వహణకు జస్టిస్‌ లావు నాగేశ్వరావును సుప్రీంకోర్టు నియమించింది. పాలనా అధికారిగా విశ్రాంత ఐపీఎస్‌ ఆధికారి దుర్గాప్రసాద్‌ని నియమించారు.

ఒక్కోసమస్య వెలుగులోకి: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్బంగా స్టేడియంలో ఒక్కోసమస్య వెలుగులోకి వస్తోంది. కేవలం సీట్లు, క్యనోపి కాదు స్టేడియంలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉంది. లోపల ఏర్పాటుచేసిన టీవీలు, ఏసీలు సరిగా పనిచేయడంలేదు వాటిని మార్చాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఎల్‌ఈడీలు అమర్చాల్సి ఉంది. గ్రౌండ్‌లో ఆడే క్రీడాకారుతోపాటు ప్రేక్షకుల కోసం ప్రతి స్టేడియంలో భారీ తెరలుంటాయి. వాటిద్వారా ఆటగాళ్లు రివ్యూలు, స్కోర్‌ వివరాలు, థర్డ్ అంపైర్ నిర్ణయాలు తెలుస్తాయి.

ఉప్పల్‌ స్టేడియంలో మాత్రం ఒకే ఒక భారీ తెర అందుబాటులో ఉండగా అందులోనూ సాంకేతిక లోపాలు ఉన్నాయి. మరొక చిన్నస్క్రీన్‌ ఉన్నా ఉపయోగంలేదు. రెండువైపులా.. పెద్దస్క్రీన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్టేడియం, గ్రౌండ్‌ అవసరాలకు ఉపయోగపడే నీటిసంపులు శుభ్రంచేసి 9ఏళ్లు అవుతోంది. వాటిని బాగుచేయాలి. అత్యాధునిక గ్రాస్‌కటింగ్ యంత్రం లేకపోగా ఉన్నది తరచూ మరమ్మతులు చేయాల్సి వస్తోంది.

కనీసం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించట్లేదు: వేలసంఖ్యలో ప్రేక్షకులువచ్చే ఈ స్టేడియంలో కనీసం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించట్లేదు. అందుకే మ్యాచ్‌ జరిగిన ప్రతిసారీ కండిషనల్ అనుమతి తెచ్చుకుని అధికారులు మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. వరల్డ్‌కప్‌ జరిగేలోపు స్టేడియంలో అన్ని సౌకర్యాలు లేకుంటే మ్యాచ్‌ నిర్వహణకు బీసీసీఐ ముందుకు రాదని హెచ్‌సీఏ అధికారులే చెబుతున్నారు. ఈసారి ప్రపంచకప్‌ భారత్‌లో జరుగుతున్నందున.. స్టేడియం ఆధునీకరణకు రూ.117.17కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆ నిధులతో స్డేడియంను పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది.

"వరల్డ్‌కప్‌కు ఈ విధంగా స్టేడియం చూపిస్తే ఎవ్వరూ ముందుకు రారు. స్టేడియంలో చాలా మరమ్మతులు చేయాల్సి ఉంది. కుర్చీలు, క్యానోపి, లైట్లు, లిఫ్ట్ మొదలైన వాటికోసం ప్రతిపాదనలు పంపుతున్నాం." - దుర్గా ప్రసాద్‌ హెచ్‌సీఏ పరిపాలనాధికారి

ఇవీ చదవండి: BRS Office In Delhi: నేడు దిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం

పెళ్లికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 10 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.