ETV Bharat / state

మోదీ వ్యాక్సిన్ కనిపెట్టారంట.. అయితే నోబెల్ అవార్డు ఇయ్యాలె: కేటీఆర్

author img

By

Published : Feb 23, 2023, 5:37 PM IST

Updated : Feb 23, 2023, 6:37 PM IST

ktr
ktr

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. మోదీ తీరుపై తనదైన శైలీలో సెటైర్స్ వేశారు. భూపాలపల్లిలో పర్యటించిన మంత్రి కేటీఆర్... అంబేడ్కర్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌ హాజరయ్యారు.

మోదీ వ్యాక్సిన్ కనిపెట్టారంట.. అయితే నోబెల్ అవార్డు ఇయ్యాలె: కేటీఆర్

ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు అడుగుతున్నారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఒక్కసారి కాదు... 10 సార్లకు పైగా అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు. భూపాలపల్లిలోని అంబేడ్కర్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. 10 సార్లకు పైగా అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. 60 ఏళ్ల పాలనలో విద్యుత్, మంచినీటి సమస్య పరిష్కారమైందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని వెల్లడించారు. 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికసాయం చేశామని తెలిపారు.

తెలంగాణలోని సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలోనూ లేవని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదని తెలిపారు. కేసీఆర్‌ పోరాటం వల్లే రేవంత్‌, సంజయ్‌కు పార్టీ అధ్యక్ష పదవులు వచ్చాయని చెప్పారు. ప్రగతిభవన్‌, సెక్రటేరియట్ పేల్చేస్తాం, కూల్చేస్తాం అని అంటున్నారు... పచ్చటి తెలంగాణను పేల్చేస్తామనే పిచ్చోళ్ల పాలు చేయొద్దన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారటం గురించి రేవంత్‌ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

రాజస్థాన్‌లో బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలో కలుపుకున్నారన్న మంత్రి కేటీఆర్.. భూపాలపల్లికి రూ.135 కోట్లతో బైపాస్‌ రోడ్డు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆచార్య జయశంకర్‌ పేరు ఒక జిల్లాకు, విశ్వవిద్యాలయానికి పెట్టామని గుర్తు చేశారు.

2014కు ముందు మోదీ చెప్పిన మాటలు ప్రజలు గుర్తు చేసుకోవాలి. పేదల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానని చెప్పి వేశారా? రాష్ట్రానికి మోదీ సర్కార్‌ ఒక్క కేంద్ర సంస్థను కూడా ఇవ్వట్లేదు. రాష్ట్రానికి వైద్య కళాశాలలు కోరితే మంజూరు చేయలేదు. ప్రధాని మోదీ... అదానీ, బండి సంజయ్‌కు మాత్రమే దేవుడు. గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన మోదీ దేవుడా? - మంత్రి కేటీఆర్‌

దేశంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో 40 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. మసీదులన్నీ తవ్వాలని బండి సంజయ్‌ అంటున్నారు... ప్రాజెక్టులు, పేదల ఇళ్ల కోసం పునాదులు తవ్వాలని మేం అంటున్నామన్నారు. మతం పేరుతో రెచ్చగొట్టడం మాత్రమే బండి సంజయ్‌కు తెలుసని ఆరోపించారు. విశాఖ ఉక్కును అమ్మినట్లే సింగరేణిని కూడా అమ్మాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని అమ్మాలని చూస్తే మరోసారి సకలజనుల సమ్మె తప్పదని హెచ్చరించారు.

కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అయితే.. తెలంగాణలోని 4 కోట్ల మందికి లాభం. దేశంలో ఎక్కడలేని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిసి మాట్లాడుతారో.. తెలియక అంటారో గానీ... మోదీ అంట ధైర్యంగా కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారంట. సరే మరి.. మేం కూడా అసెంబ్లీ నుంచి ప్రతిపాదిస్తాం.. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన ప్రధాని మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వాలె. - మంత్రి కేటీఆర్

ఇవీ చూడండి:

Last Updated :Feb 23, 2023, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.