ETV Bharat / state

Govt Schools In Telangana: బడుల బాగుకు ఎమ్మెల్యే నిధులు.. యోచిస్తున్న ప్రభుత్వం!

author img

By

Published : Nov 6, 2021, 10:02 AM IST

సర్కార్ బడుల బాగుకోసం ఎమ్మెల్యే నిధుల్లో 25 శాతం తప్పనిసరిగా కేటాయించే నిబంధనను విధించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. రెండేళ్లలో రూ.4,000 కోట్లను సర్కారు బడుల అభివృద్ధికి కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ పథకం కింద నిధుల సమీకరణపై ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది.

Govt schools in Telangana, mla funds to govt schools
సర్కార్ బడుల అభివృద్ధిపై ప్రభుత్వ యోచన, తెలంగాణ ప్రభుత్వ బడులు 2021

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్కో ఎమ్మెల్యేకు ఏటా రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తున్న నిధుల్లో 25 శాతాన్ని తప్పనిసరిగా సర్కారు బడుల్లో మౌలిక వసతులకు కేటాయించేలా ప్రభుత్వం నిబంధన విధించనుందని సమాచారం. రెండేళ్లలో రూ.4,000 కోట్లను సర్కారు బడుల అభివృద్ధికి కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ పథకం కింద నిధుల సమీకరణపై ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యేల నిధులను కేటాయించేలా మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించవచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే కొత్త జిల్లాలవారీగా ఉపాధ్యాయులను కేటాయించిన తర్వాతే హేతుబద్ధీకరణ చేయనున్నారు. జిల్లాలవారీగా కేటాయింపుపై సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) మార్గదర్శకాలు విడుదల చేసి కేటాయింపులు పూర్తయ్యాకే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జిల్లాలవారీగా కేటాయించకుండా హేతుబద్ధీకరణకు దిగితే మరోసారి బదిలీ చేయాల్సి వస్తుందని చెప్పారు.

‘ప్రైవేట్‌’ విద్యార్థులు ఉంటారా?

ఈసారి దాదాపు 2.50 లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలనుంచి వచ్చి సర్కారు బడుల్లో చేరారు. దాంతో చాలాచోట్ల ఉపాధ్యాయుల కొరత తలెత్తింది. మండల పరిధిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా ఇంకా భారీగా కొరత ఉన్నట్లు సమాచారం. వాలంటీర్లను నియమించడంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోలేదు. ప్రైవేట్‌ పాఠశాలలనుంచి చేరిన విద్యార్థులు అసలు ఉంటారా? అన్నదానిపై ఆశాఖకు అనుమానాలు ఉన్నాయి. మళ్లీ వారు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోతారని అనుమానిస్తున్నారు. ఒకవేళ వెళ్లకుంటే వాలంటీర్లను నియమిస్తామని అధికారి ఒకరు చెప్పారు. మొత్తానికి ఈ ఏడాది కూడా విద్యా వాలంటీర్లు నియామకం అనుమానంగానే ఉంది. ఒకవేళ తీసుకుంటే కొందరినే ఉండొచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి: AIMS: గ్రామీణులకు అత్యాధునిక వైద్యం.. రూ. 10కే ఏడాదంతా ఓపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.