HEAVY RAIN IN HYDERABAD: తడిసిముద్దైన భాగ్యనగరం.. నరకంలో నగరవాసులు..

author img

By

Published : Aug 24, 2021, 10:15 AM IST

hyderabad-people-facing-problems-with-rain

సోమవారం హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షానికి నగరవాసులంతా తడిసి ముద్దయిపోయారు. రహదారులపై వరద నీరు పొంగి పొర్లడంతో... ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంబులెన్స్​లు వేల సంఖ్యలో వాహనాలన్నీ నాలుగు గంటలపాటు రోడ్లపైనే ఉండాల్సి వచ్చింది.

‘‘మెహిదీపట్నంలో ఉంటున్న సివిల్‌ ఇంజినీర్‌ అభిజిత్‌ లింగంపల్లిలో ఓ ప్రాజెక్ట్‌ను చూద్దామని సోమవారం మధ్యాహ్నం కారులో వెళ్లాడు. సాయంత్రం 5.10గంటలకు తిరిగి వస్తుండగా వర్షం మొదలైంది. గచ్చిబౌలి, షేక్‌పేట మీదుగా వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకుపోతామని భావించి పటాన్‌చెరు, మియాపూర్‌ మీదుగా బయలు దేరాడు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్దకు రాగానే.. మూసాపేటలో భారీ వర్షం, ట్రాఫిక్‌జాం అంటూ గూగుల్‌ చూపించింది. అక్కడి నుంచి హైటెక్‌ సిటీ మీదుగా మళ్లించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12కు వచ్చేసరికి గంట పట్టింది. సిటీ సెంట్రల్‌కు 30 నిమిషాలు.. బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రి నుంచి మెహిదీపట్నంకు 30 నిమిషాలైంది. కేవలం 18 కి.మీ. దూరం ప్రయాణిచేందుకు 2.30 గంటల సమయం పట్టింది’’

మాసబ్‌ట్యాంకు వద్ద రోడ్డుపై నిలిచిన వరద నీటిని మళ్లించేందుకు మ్యాన్‌హోల్‌ తెరుస్తున్న యువకుడు

నగరంలో సోమవారం కురిసిన భారీవర్షం కారణంగా జనజీవనంపై పడిన ప్రభావానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఉరుముల్లేని పిడుగులా సాయంత్రం కురిసిన భారీ వర్షంతో కీలకప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. సాయంత్రం 4.20 గంటలకు ప్రారంభమైన వర్షం.. రాత్రి 8 గంటల వరకూ పడింది. రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ నిలిచింది. నగరం, శివారు ప్రాంతాల నుంచి ప్రాణాపాయ పరిస్థితుల్లో రోగులను తీసుకువస్తున్న అంబులెన్స్‌లు పెద్ద సంఖ్యలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.

కేసీబీ అతిథి గృహం వద్ద ఆటోడ్రైవరు ఇబ్బంది

నగరం నలుదిశలా అష్టకష్టాలు

భారీ వర్షం కారణంగా నగరం నలువైపులా గమ్యస్థానాలకు వెళ్తున్న వాహనదారులు నరకయాతన అనుభవించారు. కారులో ఉన్నవారు ఇంటికి వెళ్లేసరికి ఎంతసేపవుతుందోని ఆందోళన చెందగా... ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నవారు తడిసిపోయారు.

  • దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకూ హైవేపై 3 గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచింది. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, జూబ్లీహిల్స్‌-సికింద్రాబాద్‌ మార్గం వాహనాలతో నిండిపోయింది.
  • పంజాగుట్ట కూడలి, ప్రగతి భవన్‌, బేగంపేట, హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌ వరకూ ఖాళీ లేకుండా వాహనాలు నిలిచిపోయాయి.
  • సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ కూడలి, రేతిఫైల్‌ బస్‌స్టాప్‌, చిలకలగూడ సర్కిల్‌ ప్రాంతాల్లో వరద నీరు రహదారులపై ప్రవహిస్తుండడంతో గంటసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్యారడైజ్‌ సర్కిల్‌ నుంచి పంజాగుట్ట వైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
  • నాంపల్లి నుంచి లక్డీకాపూల్‌ మీదుగా ఖైరతాబాద్‌, పంజాగుట్ట వైపునకు, లక్డీకాపూల్‌ నుంచి ఖైరతాబాద్‌ను దాటేందుకు 20 నిమిషాలు, ఖైరతాబాద్‌ కూడలి నుంచి పంజాగుట్ట వరకూ 25 నిమిషాలు పట్టింది.
  • అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి కర్బలా మైదాన్‌, రాణిగంజ్‌, ప్యారడైజ్‌ జంక్షన్‌, సీటీవో జంక్షన్‌ వరకూ వాహనాలు రెండువైపులా నిలిచిపోయాయి. మాసాబ్‌ ట్యాంక్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1/12 మీదుగా తాజ్‌కృష్ణా, జీవీకేమాల్‌, వెంగళ్‌రావు పార్కు, నాగార్జున సర్కిల్‌ మార్గంలో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది.
కేసీబీ అతిథి గృహం వద్ద జాగ్రత్తగా వెళుతున్న పాదచారులు

110 ఫిర్యాదులు..

నగరవాసుల నుంచి సా.4 - రాత్రి 9 గంటల మధ్య 110 ఫిర్యాదులు అందగా 51 పరిష్కరించామని, మిగతా వాటిపై సిబ్బంది పనిచేస్తున్నారని బల్దియా తెలిపింది.

రోడ్లపై నీళ్లు.. కదలని బండ్లు...

ట్యాంక్‌బండ్‌, లిబర్టీ కూడలిలో భారీగా వాహనాలు

జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం రాజధాని రోడ్లపై తిరిగే 50 లక్షల మందికి పైగా వాహనదారుల పాలిట శాపమవుతోంది. చిన్నపాటి వర్షానికే ట్రాఫిక్‌ స్తంభించి గంటలకొద్దీ వాహనదారులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. రోడ్లపై నీరు నిలిచే 41 ప్రాంతాలతో కూడిన జాబితాను అయిదేళ్ల కిందట హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు బల్దియా అధికారులకు ఇచ్చారు. చర్యలు చేపట్టాలని ఏటా కోరుతూనే ఉన్నారు. భారీ వర్షం పడినా వాహనాలు ఆగకుండా ముందుకు వెళతాయని సూచించినా, ఆలకించడంలేదు. సాధారణ రోజుల్లో అరగంటలో చేరగలిగే గమ్యస్థానానికి వర్షం పడితే 2 గంటల సమయం పడుతోందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఆ 41 ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చేసేందుకు రూ.50 కోట్లు ఖర్చవుతుందని, నిధుల్లేని పరిస్థితుల్లో తామేం చేయగలమన్నది బల్దియా అధికారులు వాదన. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ స్తంభించింది. గమ్యస్థానాలకు చేరడానికి గంటల సమయం పట్టింది. రాత్రి 8 గంటలప్పుడు లక్షలమంది ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి కన్పించారు. ప్రధాన రోడ్లు ఆదివారం మినహా మిగతా అన్ని రోజులూ రద్దీగా ఉంటాయి. ఎక్కడా పార్కింగ్‌ ఏర్పాట్లు లేవు. లక్షలాది వాహనాలు రోడ్లపక్కనే నిలపడం వల్ల ఆయా మార్గాల్లో తరచూ ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. సాధారణ రోజుల్లో నెమ్మదిగానైనా కదిలే వాహనాలు, 2 సెం.మీ. వర్షం కురిసినా కిలో మీటరు మేర నిలిచిపోతున్నాయి.

సచివాలయం వద్ద రోడ్డు పక్కకు జారిన ద్విచక్ర వాహనం

ప్రధాన కారణాలివే (పోలీసుల పరిశీలన మేరకు)

  1. నగర పరిధిలో వరద నీటిని లాగే వ్యవస్థ సరిగా లేదు. వరద నీటి నాలాలున్నా మురుగు డ్రెయిన్లతో కలగలిసి పోయి సమస్య తలెత్తుతోంది. అనేక కూడళ్లు చెరువుల్లా మారుతున్నాయి. ఇక్కడ వేలాది వాహనాలు నిల్చిపోవడం సమస్యకు దారితీస్తోంది.
సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో సోమాజిగూడ ప్రధాన రహదారిపై ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు

ట్రాఫిక్‌ స్తంభించే ప్రాంతాలు..

  • రాజ్‌భవన్‌ సమీపంలోని లేక్‌వ్యూ అతిథి గృహం వద్ద వర్షాకాలంలో పదేళ్లుగా నీరు నిలుస్తోంది. చర్యలు తీసుకోవాలన్న లక్షలాది మంది ఆవేదన ఆరణ్య రోదనే అవుతోంది.
  • బంజారాహిల్స్ లో రోడ్డు నం.1/12 చాలా వరకు వరద నీటితో మునిగిపోతోంది. చుట్టూ నాలుగైదు కి.మీ. మేర ఆ ప్రభావం పడుతోంది.
  • బహుదూర్‌పురా వద్ద నీరు చేరి కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. కర్నూలు వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
  • నల్గొండ క్రాస్‌రోడ్డు, ఒలిఫెంటా బ్రిడ్జి, ఖైరతాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు, కేసీపీ జంక్షన్‌ చెరువుల్లా మారుతున్నాయి.
ఎక్కడెక్కడ ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిసింది?

ఇదీ చూడండి: Rain In City: హైదరాబాద్​లో భారీ వర్షం... తడిసిముద్దైన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.