ETV Bharat / state

హిందుపురం ప్రజలకు బాలయ్య బాబు గిఫ్ట్.. అదిరిందిగా..

author img

By

Published : Dec 3, 2022, 2:37 PM IST

NTR Aarogya Ratham in Hindupuram : తన నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందుపురంలో బస్సును ప్రారంభించారు. ఇది నియోజక వర్గంలోని గ్రామాలకు తిరుగుతు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది.

NTR Aarogya Ratham in Hindupuram
NTR Aarogya Ratham in Hindupuram

హిందుపురం ప్రజలకు బాలయ్య బాబు గిఫ్ట్

NTR Aarogya Ratham in Hindupuram : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. కానీ సరైన వైద్యం అందక ఎంతో మంది పేదలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరిట బస్సును ఏర్పాటు చేసి, ఓ వైద్య బృందాన్ని నియమించి.. పల్లె ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆసుపత్రుల తరహాలో అత్యాధునిక వైద్య పరికరాలతో రోగ నిర్ధారణ చేస్తూ పల్లె వాసుల అనారోగ్య సమస్యలను దూరం చేస్తున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖకు సమాంతరంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచార వైద్య సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరిట బస్సును, ఆత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. హిందూపురం నియోజకవర్గంలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రోజూ ఓ గ్రామానికి వెళ్తున్న ఆరోగ్య రథం బస్సు గ్రామీణులకు ఆధునిక వైద్య సేవలు అందిస్తోంది. రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు, ఖరీదైన మందులు ఉచితంగా ఇస్తుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

"మాకు దీని ద్వారా మందులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే బస్సు పంపి మందులు ఇవ్వటం ఎంతో సౌకర్యంగా ఉంది. మాకు ఎంతో ఆనందంగా ఉంది." -సహాయం పొందిన గ్రామస్థురాలు

"నాకు మోకీలు నొప్పితో వచ్చాను. బీపీ, షుగర్ చెక్​ చేసి మందులు ఇస్తున్నారు. నాకు ఇంజెక్షన్​, మాత్రలు ఇచ్చారు. మాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది." -సహాయం పొందిన గ్రామస్థుడు

ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా అందించే సేవల్లో ఎలాంటి లోపం జరగకుండా నందమూరి బాలకృష్ణతోపాటు ఆయన సతీమణి వసుంధర రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నారు. మందుల నిల్వల పర్యవేక్షణ, వైద్య పరికరాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అవసరమైన మందులు నెలరోజులకు సరిపడా హిందూపురం తెలుగుదేశం కార్యాలయంలో నిల్వచేస్తున్నారు. మందుల నిల్వలు తగ్గుతున్న కొద్దీ, ఎప్పటికప్పుడు తెప్పిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆరోగ్య రథంలో ఓ వైద్యుడు, నర్సు, ఫార్మసిస్టు, కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్ బృందంగా ఏర్పడి చికిత్స అందిస్తున్నారు. రోజూ క్యాంపుల నిర్వహణకు దాదాపు 40 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 200 వ్యాధులకు రోగ నిర్ధారణ చేస్తూ, ఖరీదైన మందుల వరకు అన్నీ ఉచితంగా అందిస్తున్నారు.

"మేము మా దగ్గరికి వచ్చే రోగులకు చెకప్​ చేసి మందులు ఇస్తున్నాము. చాలా వరకు ఎక్కువగా నూట్రిషన్​ లోపంతో మా దగ్గరికి వస్తున్నారు. వారికి మాత్రలు అందిస్తున్నాము." -ఆరోగ్య రథంలోని వైద్యుడు.

ఎన్టీఆర్ ఆరోగ్య రథం సేవలను నిరంతరాయంగా కొనసాగించేలా నందమూరి బాలకృష్ణ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయించారు. ఈ నిధుల నుంచి ఔషధాలు, వైద్య బృందం వేతనాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.