విచారించండి.. అరెస్ట్​ చేయొద్దు: 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో సిట్​కు హైకోర్టు ఆదేశం

author img

By

Published : Nov 20, 2022, 7:08 AM IST

High Court

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బి.శ్రీనివాస్‌లకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించడానికి సిట్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా వారిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బి.శ్రీనివాస్‌లకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించడానికి సిట్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా వారిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద షరతులకు లోబడి విచారణకు సహకరించాలని పిటిషనర్లకు ఆదేశాలిచ్చింది.

కేసుతో సంబంధం లేనివారికి సిట్‌ నోటీసులు జారీ చేస్తోందంటూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, కేసు దర్యాప్తునకు దిల్లీ పోలీసులు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. తనకు నోటీసులివ్వడాన్ని సవాల్‌ చేస్తూ బి.శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. వీటిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి శనివారం విచారణ చేపట్టారు. నోటీసుల అమలును నిలిపివేయడం లేదని, విచారణను కొనసాగించవచ్చని పేర్కొన్నారు.

విచారణకు పిటిషనర్లు సహకరించాలని, అయితే వారిని అరెస్ట్‌ చేయవద్దని సిట్‌ అధికారులను ఆదేశించారు. సిట్‌ నోటీసులను బీఎల్‌ సంతోష్‌కు అందజేయాలని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. వీటిని వ్యక్తిగతంగా గాని, వాట్సప్‌, మెయిల్‌ ద్వారా గాని పంపవచ్చన్నారు. రోజువారీగా కేసు దర్యాప్తు పర్యవేక్షణపై ధర్మాసనం స్పష్టత ఇవ్వలేదని, దీనిపై స్పష్టత తీసుకోవచ్చంటూ భాజపాను అనుమతించారు. కేసు ప్రాధాన్యం దృష్ట్యా ఏజీ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.

'రాజకీయ ఉద్రిక్తతకు అవకాశం' : దర్యాప్తు పేరుతో కేసుతో సంబంధం లేనివారిని సిట్‌ వేధింపులకు గురిచేస్తోందని భాజపా తరఫు సీనియర్‌ న్యాయవాది సీహెచ్‌.వైద్యనాథన్‌ తెలిపారు. పార్టీకి చెందిన కీలక వ్యక్తికి నోటీసులు జారీ చేయడం వంటి పరిణామాలతో జాతీయస్థాయిలో ప్రభావం ఉంటుందని.. రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తుందని పేర్కొన్నారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు నోటీసుల జారీకి ఈ కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు.

దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌లో సింగిల్‌ జడ్జికి సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు. దర్యాప్తు వివరాలను, సంతోష్‌కు నోటీసులను జారీ చేసిన అంశాన్ని పత్రికలకు వెల్లడించిందని, దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కోరారు. సిట్‌ తన పరిధిని దాటుతోందన్న అనుమానం ఉందని, అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

'దర్యాప్తును అడ్డుకునేందుకే పిటిషన్లు': అనుమానితులకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టడం దర్యాప్తులో భాగమేనని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బి.ఎస్‌.ప్రసాద్‌ పేర్కొన్నారు. దర్యాప్తును అడుగడుగునా అడ్డుకునేందుకే ఇక్కడ పిటిషన్లు వేస్తున్నారని తెలిపారు. ఏవైనా అనుమానాలుంటే సింగిల్‌ జడ్జిని ఆశ్రయించవచ్చని ధర్మాసనం చెప్పిందని, అంతే తప్ప రోజువారీ దర్యాప్తు వివరాలను నివేదించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

'దిల్లీ పోలీసులు సహకరించడం లేదు': దర్యాప్తు నిమిత్తం నోటీసులు అందజేయడంలో సిట్‌ అధికారులకు దిల్లీ పోలీసులు సహకరించడం లేదని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) జె.రామచంద్రరావు తెలిపారు. సంతోష్‌కు నోటీసులివ్వడానికి దిల్లీలో భాజపా కార్యాలయం ఉన్న దీన్‌దయాల్‌ రోడ్డుకు వెళ్తే అక్కడ ఎస్‌హెచ్‌ఓ అడ్డుకుని డీసీపీ వద్దకు తీసుకెళ్లారని, స్థానిక ఎన్నికలు ఉన్నందువల్ల సహకరించలేమని డీసీపీ చెప్పారని వివరించారు. నోటీసులు అందజేయడానికి సహకరించేలా దిల్లీ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో ఒప్పందం కుదుర్చుకునేందుకు నందు, రామచంద్ర భారతిలతోపాటు సంతోష్‌ ప్రయత్నించారని.. ఆయన పాత్రకు సంబంధించి కీలక సమాచారం ఉందని పేర్కొన్నారు. హరేరామ్‌ స్వామి, మరొకరిని సంతోష్‌ కలిసి తెరాస ఎమ్మెల్యేలను భాజపాలోకి తీసుకురావడానికి కుట్ర పన్నారన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు ఆసక్తి చూపారని వాట్సప్‌ సందేశాలు ఉన్నాయన్నారు. నోటీసులను పార్టీ సవాల్‌ చేయలేదని, అభ్యంతరం ఉంటే వ్యక్తిగతంగా పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని తెలిపారు.

'చట్టవిరుద్ధంగా నోటీసులు': ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేశారని శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది పొన్నం అశోక్‌గౌడ్‌ తెలిపారు. కేసులో నిందితుడిగా లేకపోయినప్పటికీ నోటీసులు జారీ చేశారని, సాక్షులకు ఈ సెక్షన్‌ కింద జారీ చేయకూడదని పేర్కొన్నారు. నోటీసులను కొట్టివేయాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.