ETV Bharat / state

Flow For Projects: వరద పారుతుంది.. ప్రాజెక్టు నిండుతుంది

author img

By

Published : Jul 15, 2021, 10:48 PM IST

water projects
water projects

రాష్ట్రంలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. మూడురోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణా పరివాహాక జలాశయాల్లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది.

రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి 1,83,883 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1,082.7 అడుగులు ఉంది. జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశాయానికి వరద పోటెత్తుతుంది. ప్రాజెక్టులోకి 30 వేల క్యూసెక్కులు వరద ప్రవాహం వస్తుండగా... 38 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 7 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ 19.48 టీఎంసీలకు చేరింది.

పోటెత్తుతున్న వరద...

మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ, సరస్వతి బ్యారేజీలకు వరద నీరు వచ్చి చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి 1,45,90 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... 39 గేట్లు ఎత్తి 1,72,560 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 13 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అన్నారం బ్యారెజీకి 45 వేల క్యూసెక్కులు వరద వస్తుండగా 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న గోదావరి...

భద్రాచలం వద్ద గోదావరికి వరద స్వల్పంగా పెరుగుతోంది. ఎగువన లక్ష్మీ బ్యారేజ్, తాలిపేరు ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం 15 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం ఇవాళ 17 అడుగులకు చేరింది. సంగారెడ్డిలోని మంజీరా నదిలోకి వరద పెరుగుతుండటంతో సింగూర్ ప్రాజెక్టులోకి 2,574 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.34 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 523.6 మీటర్లు కాగా ప్రస్తుతం 521.04 మీటర్లుగా ఉంది.

ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద...

కర్ణాటక నుంచి జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 12,500 క్యూసెక్కులు వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.275 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ జూరాలలో 2 యూనిట్లు, దిగువ జూరాలలో 2 యూనిట్ల విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: వాగులో చిక్కుకున్న ఎనిమిది మంది.. కాపాడేందుకు స్థానికుల ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.