ETV Bharat / state

మంత్రి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేయండి: కోర్టు ఆదేశం

author img

By

Published : Jan 11, 2023, 6:38 PM IST

Rambabu
ap minister Rambabu

Case on Minister Ambati : ఏపీ మంత్రి రాంబాబు లాటరీ చిక్కుల్లో పడ్డారు. సంక్రాంతికి రూ.వంద కట్టండి.. రూ.లక్షల విలువైన బహుమతులు గెలుచుకోండి అంటూ సత్తెనపల్లి నియోజకవర్గ జనాన్ని ఊరించిన మంత్రి అంబటి.. ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. రాష్ట్రంలో లాటరీ చట్ట విరుద్ధమని జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో.. అంబటిపై కేసు నమోదుకు గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది.

Case on Minister Ambati : ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఏది చేసినా.. చిరిగి చాటవడం కాదు.. చాపంతవుతుంది. కాకపోతే ఆయన ఒకటి అనుకుంటే.. జల వనరుల శాఖలో రివర్స్‌ టెండరింగ్‌లాగే మరొకటి అవుతుంది. మొన్నా మధ్య సత్తెనపల్లిలో ముగ్గుల పోటీ నిర్వహించిన అంబటి రాంబాబుకు ఓ మహిళ పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీ వద్దు-జనసేన ముద్దు అంటూ ముగ్గుతో రాశారు. వైసీపీ శ్రేణులు.. ఈ షాక్‌ నుంచి తేరుకోకముందే అంబటికి మరో చిక్కు ఎదురైంది.

సంక్రాంతికి వైసీపీ నేతలు లక్కీ డ్రా పెట్టారు. దానికి పేరు కూడా వైఎస్‌ఆర్‌ సంక్రాంతి లక్కీ డ్రా అని పెట్టారు. పార్టీ తరఫునే నిర్వహిస్తున్నట్లు వేలకు వేలు టోకెన్లు ముద్రించారు. అక్కడా వైసీపీ నేతలు.. ప్రొటోకాల్‌ పాటించారు. ముఖ్యమంత్రి జగన్‌, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫొటోలూ ముద్రించారు. ఈ స్థాయిలో ఏర్పాట్లు చేసిన వైసీపీ నేతలు.. ప్రచారం అంతకుమించి చేశారు. ఏకంగా మంత్రి అంబటి రాంబాబే.. ఈ లాటరీలో ఏమేమున్నాయో చెప్పి ఊరించారు.

ambati lottorry
అంబటి లాటరీ..

అన్నీ పురుషుల కోసమే అయితే ఏం బాగుంటుంది.. మహిళలను ఆకర్షించేందుకూ ప్రణాళికలు వేశారు. డైమండ్‌ నెక్లెస్‌ గెలుచుకోవచ్చాన్నారు మంత్రి అంబటి. రూ.100 పెట్టి లాటరీ టికెట్‌ కొంటే.. అంతకన్నా ఎక్కువే గిట్టుబాటు అవుతుందన్నారు. అంబటి వారి అదిరిపోయే ప్రచారం జనసేన నేతల కంటపడింది. అసలు రాష్ట్రంలో అనుమతి లేకుండా లాటరీ ఎలా నిర్వహిస్తారంటూ అంబటిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంబటి ఆధ్వర్యంలోనే లాటరీ జరుగుతోందని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అంబటిపై కేసు నమోదుకు పోలీసులు ససేమిరా అన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలను వదిలిపెట్టరాదని నిర్ణయించిన జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు.. గుంటూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు. లాటరీ టికెట్ల గురించి అంబటి చేసిన ప్రచార వీడియోను కోర్టుకు సమర్పించారు. రాష్ట్రంలో లాటరీ వ్యాపారానికి అనుమతి లేకపోయినా బహుమతుల పేరిట టికెట్లు విక్రయిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. కేసు విచారించిన న్యాయమూర్తి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.