Seasonal Diseases: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం.. ప్రతి శుక్రవారం ప్రత్యేక డ్రైవ్

author img

By

Published : Jul 28, 2022, 7:38 PM IST

Seasonal Diseases

Govt Alert On Seasonal Diseases: భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. ప్రజలకు అత్యవసర సేవలు అందించాలని కలెక్టర్లు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించింది.

Govt Alert On Seasonal Diseases: రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అత్యవసర సేవలు అందించాలని కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టినట్లు పేర్కొంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వివరించింది.

ప్రతి శుక్రవారం డ్రై డే: సీజనల్ వ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఇతర సంస్థల్లో ప్రతి శుక్రవారం డ్రై డే లాంటి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని కలెక్టర్లను ఇటీవల మంత్రులు కోరారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల ప్రత్యేక ప్రచారాన్ని కూడా పునరుద్ధరించాలన్నారు. సాధారణ పారిశుద్ధ్యం, డ్రైన్‌ క్లీనింగ్‌, దోమల నివారణ చర్యలను ముమ్మరం చేసేలా కమిషనర్లు చురుగ్గా పాల్గొనేలా చూడాలని పురపాలకశాఖ అధికారులకు స్పష్టం చేశారు.

హాస్టల్ వార్డెన్లదే బాధ్యత: దోమలు, లార్వా నిరోధక చర్యలను వేగవంతం చేయాలని... నీటి ఎద్దడి నివారణ, డ్రైన్‌ క్లీనింగ్‌, చెత్త ఎత్తివేయడం, గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీలు, ఆరోగ్య సిబ్బందిని క్రియాశీలం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బోరు బావుల పరిసర ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, కుళాయి, బోరు బావుల వద్ద నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయాల్లో హాస్టల్ వార్డెన్లు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

పారిశుద్ధ్య సిబ్బంది విధులను కూడా పర్యవేక్షించాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని గురుకులాలు, వసతిగృహాల్లో ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించింది. బియ్యం నాణ్యతను కలెక్టర్లు పాఠశాలలు, హాస్టళ్లలో క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. పాఠశాలలు, హాస్టళ్ల పనితీరు పర్యవేక్షణకు ప్రతి సంస్థకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. వర్షాలు, వరదలతో వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

వైద్య సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులకు తగు సూచనలు ఇవ్వడం, జిల్లాల్లో విషజ్వరాలు, డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. జిల్లాల్లో ఔషధాలకు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండి పర్యవేక్షించాలని ఆదేశించినట్లు తెలిపింది.

ఇవీ చదవండి: NVSS ON CM KCR: హైదరాబాద్‌లో మిషన్ కాకతీయ ఏమైంది?: ఎన్వీఎస్ఎస్

'దేనికైనా ఓ హద్దు ఉంటుంది'.. న్యాయమూర్తుల్ని 'టార్గెట్' చేయడంపై సుప్రీం అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.