హైదరాబాద్ నారాయణగూడలో తన పుట్టినరోజని స్నేహితురాలిని ఆహ్వానించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన రోహన్ అనే యువకుడిని పోలీసుల అరెస్టు చేశారు. నారాయణగూడకు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. స్నేహితురాలి ద్వారా యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండలం గంగాముల తండాకు చెందిన 19 ఏళ్ల కరంటోతు రోహన్ ఆమెకు పరిచయమయ్యాడు. అతను నగరంలో ఐటీఐ చదువుతున్నాడు. డిసెంబర్ 29న రాత్రి 9 గంటల సమయంలో తన పుట్టినరోజని చెప్పి బాలికను తీసుకెళ్లాడు. అర్ధరాత్రి వరకు కూడా తమ కూతురు ఇంటికి రాకపోవడం వల్ల బాధిత బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
డిసెంబరు 30 వేకువజామున 4 గంటల ప్రాంతంలో బాధిత బాలిక ఇంటికి చేరింది. ఏమైందని తల్లిదండ్రులు బాధితురాలిని నిలదీయగా బదులివ్వలేదు. ఆమెను భరోసా కేంద్రానికి పోలీసులు పంపించగా అక్కడి పోలీసులు, కౌన్సిలర్లకు అసలు విషయం చెప్పింది.
వనస్థలిపురం సమీపంలోని ఇంజాపూర్ గ్రామం సాహెబ్నగర్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఆమె ఫిర్యాదుపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని సాహెబ్నగర్లో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఇవీ చూడండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం