ETV Bharat / state

ఇకపై పర్యాటక ప్రాంతంగా రాష్ట్రపతి నిలయం.. 14 నుంచే బుకింగ్స్​ ఓపెన్​

author img

By

Published : Mar 7, 2023, 8:54 AM IST

Rastrapathi Nilayam Bollaram
బొల్లారం రాష్ట్రపతి నిలయం

Bollaram Rashtrapathi Nilayam: 162 ఏళ్ల చరిత్ర కలిగిన బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని ప్రతి సంవత్సరం సందర్శించాలనే కోరిక తొందరలోనే తీరనుంది. ఇక నుంచి ఏడాది పొడవునా సందర్శించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 14 నుంచి ఆన్​లైన్​, ఆఫ్​​లైన్​లో టికెట్లు బుక్​ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

Bollaram Rashtrapathi Nilayam: సికింద్రాబాద్​లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయాన్ని సాధారణ ప్రజలు.. ఇక నుంచి ఏడాది పొడవునా సందర్శించే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం, ప్రభుత్వం సెలవు దినాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చునని తెలిపింది. అయితే గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం పక్షం రోజుల పాటు ప్రజల సందర్శనకు అవకాశం ఉండేది. ఈ క్రమంలోనే 162 ఏళ్ల రాష్ట్రపతి నిలయం చారిత్రక ప్రాధాన్యం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఉగాది పర్వదినం సందర్భంగా ఈ మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రపతి నిలయంలోకి ఏడాది పొడవునా వెళ్లే వెసులుబాటు రానుంది. సాధారణ ప్రజల సందర్శనను ఉగాది రోజున.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్​గా ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలోని మెట్లబావి, జైహింద్​ ర్యాంపు పునరుద్ధరణకు.. చారిత్రక ఫ్లాగ్​ పోస్ట్​ ప్రతి రూపానికి వర్చువల్​ విధానంలోనే రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశంతో.. రాష్ట్రపతి నిలయంలోని గార్డెన్స్​తో పాటు ఇక నుంచి చారిత్రక భవనాన్ని కూడా సాధారణ ప్రజలు సందర్శించే అవకాశం ఉంటుంది. ఆధునీకరించిన ఆర్ట్​ గ్యాలరీ, భూగర్భ సొరంగ మార్గం, రాక్ గార్డెన్, హెర్బన్ గార్డెన్, బట్టర్ ఫ్లై గార్డెన్, నక్షత్ర గార్డెన్, జైహింద్ ర్యాంపు, ఫ్లాగ్ పోస్ట్ తదితరాలను సందర్శించవచ్చు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ఈ మార్చి 14 నుంచి ఆన్​లైన్​లో ప్రజలు బుక్​ చేసుకునేందుకు అవకాశం ఉంది.

Rashtrapathi Nilayam In Bollaram: రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్​సైట్ నుంచి టికెట్ల బుక్ చేసుకోవచ్చు. అక్కడకు వెళ్లి కూడా నేరుగా టికెట్లు తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ రుసుమును భారతీయులకు రూ.50, విదేశీయులకు రూ.250లుగా నిర్ధారించారు. సందర్శకుల కోసం రాష్ట్రపతి నిలయంలో ఉచితంగా పార్కింగ్, వస్తువులు భద్రపరుచుకునేందుకు ప్రత్యేక గది, వీల్ ఛైర్ సదుపాయం, మంచి నీరు, ప్రాథమిక చికిత్స సహా ఇతర వసతులను ఏర్పాటు చేస్తున్నారు.

బొల్లారం రాష్ట్రపతి నిలయం చరిత్ర: దేశంలోనే అత్యున్నతమైన నివాసంగా దిల్లీలోని రాష్ట్రపతి భవనం ఉంటుంది. పాలన మొత్తం ఉత్తర భారతదేశానికే పరిమితం కాకుండా ఉండాలనే ఆలోచనతో.. దక్షిణాదిలో ఈ బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ నిలయాన్ని బ్రిటీషర్లు 1805లో బొల్లారంలో నిర్మించారు. ఈ గృహాన్ని అప్పట్లో వైశ్రాయ్​ అతిథి గృహంగా పిలిచేవారు. ఆంధ్రసబ్​ ఏరియా కార్యాలయానికి విచ్చేసే భద్రతాధికారులు ఇందులో ఉండేవారు. ఆ తర్వాత బ్రిటీష్​ రెసిడెంట్​పై దాడి జరగడంతో కోఠి నుంచి నివాసాన్ని బొల్లారానికి మార్చారు. అనంతరం దానిని నిజాం స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనాన్ని కేంద్రం 1950లో రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. రాష్ట్రపతి నిలయంగా పేరు మార్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.