ETV Bharat / state

Venkaiah Naidu: 'రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి'

author img

By

Published : Apr 23, 2023, 1:31 PM IST

Venkataiah Naidu
Venkataiah Naidu

National Civil Services Day Celebrations In Hyderabad: అధికారులు అభివృద్ధికి సారథులు.. భవిష్యత్తుకు వారథులుగా నిలవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్​ సివిల్​ సర్వీసెస్​ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని.. చట్ట సభలు కాస్తా కొట్లాడుకునే సభలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

National Civil Services Day Celebrations In Hyderabad: రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని.. చట్ట సభలు కాస్తా కొట్లాడుకునే సభలుగా మారుతున్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్​ సివిల్​ సర్వీసెస్​ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సివిల్​ సర్వీసెస్​ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.

భారత సివిల్​ సర్వీసెస్​ దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, సివిల్​ సర్వీసెస్​, న్యాయ వ్యవస్థలో ఉన్నవారు, మీడియాలో ఉన్నవారు నిష్పాక్షికంగా తమ బాధ్యతలను నిర్వహించాలని సూచించారు. ఆయా రంగాల్లో వారు సమర్థవంతంగా సేవలు అందిస్తే.. దేశం వృద్ధి సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అధికారులు అభివృద్ధికి సారథులు.. భవిష్యత్తు వారథులు: బ్రిటీష్​ వారు దేశాన్ని, ప్రజల ఆలోచనలను కూడా దోచుకున్నారని వెంకయ్య విమర్శించారు. దేశ పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలని పిలుపునిచ్చారు. సివిల్​ సర్వీసెస్​లో ఉన్నవారు నీతి, నిజాయతీతో వ్యవహరించాలని తెలిపారు. ప్రజలకు నేరుగా లబ్ధి కలగజేయడంలో సివిల్​ సర్వీసెస్​ అధికారులదే కీలకపాత్ర అని గుర్తు చేశారు. అధికారులు అంటే.. అభివృద్ధికి సారథులు, భవిష్యత్​కు వారథులు అని కితాబిచ్చారు. కాలానుగుణంగా.. భవిష్యత్​ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. అధికారులు.. ప్రజల బాధలను సావధానంగా, ఓర్పుగా వినాలని సూచించారు.

బుల్లెట్​ కంటే బ్యాలెట్​ శక్తివంతమైనది: ఇప్పుడున్న రాజకీయ నాయకులు అవకాశవాదులుగా మారిపోతున్నారని.. క్యాస్ట్​, కమ్యూనిటీ, క్యాష్​, క్రిమినాలిటీ వంటివి ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చేశాయని ఆవేదన చెందారు. అధికారులు, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం సిగ్గుచేటు తనమని ఆగ్రహించారు. సివిల్​ సర్వీస్​ ఆదర్శవంతమని.. శాంతికి విఘాతం కలిగించే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని వెంకయ్య నాయుడు హితవు పలికారు. బుల్లెట్​ కంటే బ్యాలెట్​ చాలా శక్తివంతమైందని అని.. ఎన్నికలు వచ్చినప్పుడు పక్షపాతంగా ఓట్లు వేయడం సరికాదని వివరించారు. సివిల్​ సర్వీసెస్​లో ఉండే వారు తెలివిగా వ్యవహరించాలన్నారు.

పరిపాలన ఉత్తర్వులు.. కోర్టు వాదనలు స్థానిక భాషలో ఉండాలి: సంప్రదాయాన్ని పాటించాలని.. పెద్దలు చూపిన దారిలో నడవాలని వెంకయ్య సూచించారు. తెలుగు భాష చదువుకున్న తాను భారత ఉపరాష్ట్రపతి కాలేదా అని ప్రశ్నించారు. మాతృభాషలో చదివితే ఉన్నత స్థానాలకు వెళ్లలేమన్నది అపోహ మాత్రమేనని అన్నారు. పరిపాలన ఉత్తర్వులు మాతృభాషలో ఉండాలని.. కోర్టులు సైతం స్థానిక భాషల్లో వాదనలు వినిపించాలని మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విన్నవించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.