ETV Bharat / state

'యాదాద్రి, భద్రాద్రి'లకు కొత్త సమస్య!.. విద్యుత్‌ కేంద్రాలకు రుణం నిలిపివేత

author img

By

Published : Mar 31, 2022, 7:35 AM IST

‘యాదాద్రి, భద్రాద్రి’లకు కొత్త సమస్య!.. విద్యుత్‌ కేంద్రాలకు రుణం నిలిపివేత
‘యాదాద్రి, భద్రాద్రి’లకు కొత్త సమస్య!.. విద్యుత్‌ కేంద్రాలకు రుణం నిలిపివేత

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కానీ ఆ పనుల పూర్తికి సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి రుణాలిచ్చేందుకు అంగీకరించిన జాతీయ విద్యుత్‌ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ) తాజాగా రుణాల నిధుల విడుదల నిలిపివేయడమే దీనికి కారణం. కేంద్రం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల వల్లనే బిల్లులు ఆపేసి ఉంటారని రాష్ట్ర విద్యుత్‌ వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాల పూర్తికి నిధుల సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి రుణాలిచ్చేందుకు అంగీకరించిన జాతీయ విద్యుత్‌ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ) తాజాగా రుణాల నిధుల విడుదల నిలిపివేయడమే దీనికి మూలం. కారణాలను సైతం ఆ సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. నిజానికి ఎప్పటికప్పుడు విద్యుత్కేంద్రాల నిర్మాణ పనుల పురోగతిని బట్టి బిల్లులు దాఖలు చేస్తే నెలవారీగా నిధులు విడుదల చేయాలి. కానీ ఫిబ్రవరి నెలాఖరులో దాఖలు చేసిన బిల్లులకు మార్చి మాసం ముగుస్తున్నా ఇంకా నిధులు విడుదల చేయలేదు. కేంద్రం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల వల్లనే బిల్లులు ఆపేసి ఉంటారని రాష్ట్ర విద్యుత్‌ వర్గాలు భావిస్తున్నాయి.

రూ.వేల కోట్ల రుణానికి గతంలోనే అనుమతి: భద్రాద్రి, యాదాద్రి విద్యుత్కేంద్రాలకు మూడేళ్ల క్రితమే పీఎఫ్‌సీ రుణాలను మంజూరు చేసింది. వీటిలో మణుగూరు సమీపంలో గల భద్రాద్రి ప్లాంటు పనులు పూర్తయినందున దానికి 90 శాతానికి పైగా నిధులు ఇప్పటికే విడుదలయ్యాయి. నల్గొండ జిల్లా దామెరచర్ల సమీపంలో 4 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం(ఒక్కోటి 800 మెగావాట్లతో అయిదు ప్లాంట్లు)తో నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయం రూ.29 వేల కోట్లు కాగా ఇందులో రూ.20 వేల కోట్లను రుణంగా ఇవ్వడానికి పీఎఫ్‌సీ గతంలో అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రూ.13 వేల కోట్లకు పైగా విలువైన పనులను రాష్ట్ర జెన్‌కో యాదాద్రి ప్లాంటులో పూర్తిచేసింది. రూ.1,100 కోట్ల వరకూ నిధులు విడుదల చేయాలని పీఎఫ్‌సీకి బిల్లులు దాఖలు చేసింది. కానీ నిధులు రాకపోవడంతో నిర్మాణ పనులపై ప్రభావం పడింది. ఈ నిర్మాణాలను జెన్‌కో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భెల్‌కు అప్పగించింది.

మేం చెల్లింపులు ఎలా చేయాలి: భెల్‌

యాదాద్రిలో మొదటి ప్లాంటు 2020 అక్టోబరు కల్లా విద్యుదుత్పత్తి ప్రారంభించాలనేది తొలుత పెట్టుకున్న లక్ష్యం. గత రెండేళ్లుగా కరోనా విపత్తు వల్ల పనుల్లో జాప్యం జరిగింది. 2023 జూన్‌కైనా మొదటి ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించేందుకు వేగంగా పనులు చేయించాలని భెల్‌పై జెన్‌కో ఒత్తిడి తెస్తోంది. కానీ బిల్లులు రాకపోతే తాము కూలీలకు, సామగ్రి సరఫరాదారులకు చెల్లింపులు ఎలా చేయాలని భెల్‌ ప్రశ్నిస్తోంది. విద్యుత్‌ సంస్కరణల అమలుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటున్నందునే కేంద్ర విద్యుత్‌శాఖ రుణం విడుదలకు సుముఖంగా లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సమస్యను పీఎఫ్‌సీ దృష్టికి తీసుకెళ్లాం

నిధుల విడుదల ఆపేసిన మాట వాస్తవం. ఇలా చేయడం రుణ ఒప్పందానికి పూర్తి విరుద్ధం. దీని వల్ల తెలంగాణకు భారీ నష్టం జరుగుతుందని సమస్యను పీఎఫ్‌సీ దృష్టికి తీసుకెళ్లాం. - ప్రభాకరరావు, సీఎండీ, తెలంగాణ జెన్‌కో-ట్రాన్స్‌కో

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.