E-Nomination‌: ఈ-నామినేషన్ చేయకపోతే.. ఈపీఎఫ్‌ సేవలు బంద్‌

author img

By

Published : Jan 11, 2022, 5:28 AM IST

Nomination‌

E-Nomination‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) చందాదారులకు ఈ-నామినేషన్‌ తప్పనిసరి చేసింది. గతంలో పలుమార్లు గడువు పొడిగించిన సంస్థ.. తాజాగా ఆ వివరాలు నమోదు చేసేవరకు సేవలు పొందకుండా ఆంక్షలు విధించింది

E-Nomination‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) చందాదారులకు ఈ-నామినేషన్‌ తప్పనిసరి చేసింది. గతంలో పలుమార్లు గడువు పొడిగించిన సంస్థ.. తాజాగా ఆ వివరాలు నమోదు చేసేవరకు సేవలు పొందకుండా ఆంక్షలు విధించింది. ఈపీఎఫ్‌ నుంచి నిధుల ఉపసంహరణతో పాటు ఖాతాలో ఎన్ని నిధులు నిల్వ ఉన్నాయో చూసుకునే అవకాశాన్ని ఈ నెల 1 నుంచి తొలగించింది. ఈ-నామినేషన్‌ పూర్తి చేసిన చందాదారులే ఆన్‌లైన్‌ సేవలు పొందవచ్చని స్పష్టం చేస్తోంది. అయితే.. ఈపీఎఫ్‌వో మెంబర్‌ పోర్టల్‌లో ఈ-నామినేషన్‌ నమోదుకు ఖాతాదారులు ప్రయత్నిస్తుండగా.. సర్వర్‌లో సాంకేతిక సమస్యలతో సాధ్యం కావడం లేదు.

వేగంగా క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు..

ఈపీఎఫ్‌వో డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ.. భవిష్యత్తులో మరింత సులభతరంగా సేవలు అందేలా చర్యలు చేపట్టామని చెబుతోంది. ఈపీఎఫ్‌ చందాదారుడిగా నమోదైనప్పుడే సభ్యుల నామినీ వివరాలను కాగితం రూపంలో సేకరించింది. ఆ వివరాలు పూర్తిస్థాయిలో డిజిటైలేషన్‌ కాలేదు. దీంతో చందాదారుడు చనిపోయినపుడు వారసులకు ఈపీఎఫ్‌ మొత్తం, పింఛను, ఉద్యోగి డిపాజిట్‌ ఆధారిత బీమా(ఈడీఎల్‌ఐ) అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు ఈ-నామినేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చందాదారులు ఈ వివరాలను నమోదు చేసుకోవాలని గత కొంతకాలంగా సూచిస్తూ వస్తోంది. ఇందుకు 2021 డిసెంబరు 31ను గడువని పేర్కొంది. అయినప్పటికీ కోట్ల మంది చందాదారులు వివరాలు నమోదు చేయలేదు. చివరి నిమిషంలో సర్వర్‌పై ఒత్తిడి పెరగడంతో సాధ్యం కాలేదు. దీంతో డిసెంబరు 31 తర్వాతా ఈ-నామినేషన్‌ నమోదుకు సంస్థ అనుమతి ఇచ్చింది.

యజమాని ద్వారానే ఆధార్‌ అనుసంధానం..

పీఎఫ్‌ ఖాతా నంబరు (యూఏఎన్‌)కు ఆధార్‌ అనుసంధానాన్ని ఈపీఎఫ్‌వో తప్పనిసరి చేసింది. గడువులోపు ఆధార్‌ వివరాలివ్వని చందాదారులకు 2019-20 ఏడాది నుంచి పీఎఫ్‌ నగదు నిల్వలపై వడ్డీ జమను నిలిపివేసింది. ఆధార్‌ వివరాలిచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని ఖాతాలో తిరిగి చూపించింది. అప్పటికీ ఆధార్‌ వివరాలివ్వని చందాదారుల ఖాతాల్లో నెలవారీ వేతనం నుంచి చందా జమను నిషేధించింది. దీంతో చందాదారులు ఈపీఎఫ్‌వో మెంబర్‌ పోర్టల్‌ ద్వారా ఆధార్‌ అనుసంధానం చేశారు. జనవరి 1 నుంచి ఈ సదుపాయాన్ని భవిష్యనిధి సంస్థ తొలగించింది. సంబంధిత యజమాని ద్వారానే ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలని నిర్దేశించింది.

ఈ-నామినేషన్‌ఇలా..

* ఈపీఎఫ్‌వో మెంబర్‌ పోర్టల్‌లో యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.
* ప్రొఫైల్‌లో చందాదారుడి వ్యక్తిగత వివరాలు, ఫొటో అప్‌లోడ్‌ చేయాలి
* మేనేజ్‌లో ఈ-నామినేషన్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
* వారసుల వివరాలు, ఆధార్‌ సంఖ్య, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి.
* వారసుల ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంతో పాటు వారికి నగదు నిల్వల్లో వాటా స్పష్టంగా పేర్కొనాలి.
* ఈ-సైన్‌ ఆప్షన్‌ ఎంచుకుని.. చందాదారుడి ఆధార్‌ నంబరు నమోదు చేయాలి.
* ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఈ-నామినేషన్‌ పూర్తవుతుంది.

ఇదీచూడండి: కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్- రాత్రి 10 గంటల వరకు టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.