ETV Bharat / state

DRUGS CASE : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. ఇవాళ విచారణకు పూరి!

author img

By

Published : Aug 31, 2021, 4:15 AM IST

Updated : Aug 31, 2021, 6:40 AM IST

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పూరి జగన్నాథ్​కు ఇది వరకే నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు... దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పూరి జగన్నాథ్​ను ప్రశ్నించనున్నారు.

enforcement-directorate-to-begin-questioning-tollywood-personalities-in-tollywood-drugs-case
enforcement-directorate-to-begin-questioning-tollywood-personalities-in-tollywood-drugs-case

సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద 12మంది సినీ రంగానికి చెందిన వాళ్లకు నోటీసులు జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలని సూచించింది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఛార్మి, 6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్​తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్​, 20న నందు, 22న తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించారు.

వారిని నిందితులుగా పేర్కొనలేదు..

ఈ కేసును దర్యాప్తు చేసిన ఆబ్కారీ సిట్ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. సిట్ అధికారి శీలం శ్రీనివాస్ రావు సోమవారం ఈడీ కార్యాలయానికి వెళ్లి కేసుకు సంబంధించిన వివరాలను అందించారు. డ్రగ్స్ కేసులో ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్​కు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు నేతృత్వం వహించారు. సిట్ ఆధ్వర్యంలో 12మంది సినీ తారలను ప్రశ్నించారు. వాళ్ల గోర్లు, తల వెంట్రుకలను సేకరించి... ల్యాబ్​కు పంపారు. సిట్ దర్యాప్తులో ఎక్కడ కూడా సినీరంగానికి చెందిన వాళ్లు నిందితులుగా పేర్కొనలేదు.

  • 2017లో బయటికొచ్చింది..

2017 జులైలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు బయటికొచ్చింది. కెల్విన్ అనే మత్తు మందుల స్మగ్లర్​ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో పాతబస్తీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. 30లక్షల రూపాయల విలువ చేసే మత్తపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లను ప్రశ్నించిన ఎక్సైజ్ అధికారులు.. వాళ్ల చరవాణిలోని నెంబర్ల ఆధారంగా సినీ రంగానికి చెందిన పలువురికి మత్తు మందులు సరఫరా చేసినట్లు తేల్చారు. కేసు ప్రాధాన్యం సంతరించుకోవడంతో ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు 11 మంది సినీ రంగానికి చెందిన వాళ్లతో పాటు మరో 50 మందిని ప్రశ్నించారు. రవితేజ, ఛార్మి, ముమైత్ ఖాన్, పూరి జగన్నాథ్, తరుణ్, నవదీప్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తనీష్, నందు, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ నాయుడుని ప్రశ్నించారు. ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించిన వాళ్లలో విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు.

30 మంది నిందితులు

దర్యాప్తులో పురోగతిని బట్టి 12 ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారు. డ్రగ్స్ వాటినట్లు శాస్ర్రీయ ఆధారాలు సేకరించడానికి గోర్లు, తల వెంట్రకలు, రక్తనమూనాలు తీసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపారు. సిట్ అధికారులు ఇప్పటి వరకు ఫోరెన్సిక్ నివేదికను బయటపెట్టలేదు. 12 ఎఫ్ఐఆర్​లలో 12 నేరాభియోగపత్రాలను సిట్ అధికారులు దాఖలు చేశారు. దాదాపు 30మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో ఆఫ్రికన్, యూరోప్ దేశాలకు చెందిన 8 మందితో పాటు... హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయించే చిన్న చితకా స్మగ్లర్లను నేరాభియోగపత్రాల్లో చేర్చారు. ఎక్కడ కూడా సినీ రంగానికి పేర్లను సిట్ చేర్చలేదు. సినీ రంగానికి చెందిన వాళ్లకు సిట్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారనే విమర్శలు వచ్చాయి.

హైకోర్టు ఆదేశంతో..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆబ్కారీ శాఖ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు కేసును అప్పగించాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేవంత్ తరఫు న్యాయవాది రచనా రెడ్డి ఈడీని రెస్పాండెంట్​గా చేర్చింది. దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. ఆబ్కారీ సిట్ అధికారులు వివరాలు అందించడం లేదని ఈడీ అధికారులు హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశంతో సిట్ అధికారులు ఈడీ అధికారులకు వివరాలు అందించడంతో... వాటిని పరిశీలించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు.

మనీలాండరింగ్ చట్టం కింద..

ఆబ్కారీ సిట్ అధికారులు మత్తుపదార్థాల వినియోగం, సరఫరాపైనే దర్యాప్తు నిర్వహించారు. ఈడీ అధికారులు మనీలాండరింగ్ చట్టం కింద విచారణ చేపడుతున్నారు. సినీ రంగానికి చెందిన 12మంది మనీలాండరింగ్​కు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వాళ్ల నుంచి సేకరించే సమాచారాన్ని బట్టి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు మరింత మందిని ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: DRUGS CASE: డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ మొదలైంది..

Last Updated : Aug 31, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.