ETV Bharat / state

శాసనసభ ఎన్నికల కోసం నేడు ఓటర్ల జాబితా ప్రకటన

author img

By

Published : Jan 5, 2023, 7:51 AM IST

Election Commission
Election Commission

New Voter List In Telangana: శాసనసభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించనున్నారు. 2023 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో రెండు కోట్లా 95 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులతో ఓటర్ల సంఖ్య పెరగనుంది.

New Voter List In Telangana: 2023 జనవరి ఒకటో తేదీ అర్హత తేదీతో.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కసరత్తు ఇవాళ్టితో ముగియనుంది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ.. ఓటు హక్కు ఉండాలన్న భావనతో ఈసీ ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ చేపడుతోంది. అందులో భాగంగా ఇంటింటి సర్వే, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కసరత్తు పూర్తి చేసి 2022 నవంబర్ తొమ్మిదో తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించింది.

ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య రెండు కోట్లా 95 లక్షలకుపైగా ఉంది. ముసాయిదాపై అభ్యంతరాలు, వినతులతోపాటు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జాబితాలో పేర్లు లేని వారితోపాటు.. 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకునే వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై విస్తృత అవగాహన చేపట్టారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో వివిధ దశల్లో సమావేశాలు నిర్వహించారు.

కళాశాలలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అర్హులను జాబితాలో చేర్పించేలా ప్రోత్సహించారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక అవగాహనా దినాల పేరిట అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు ఉండి దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ఫాం 6, ఫాం 7, ఫాం 8 కి సంబంధించిన మొత్తం దాదాపు తొమ్మిది లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పరిష్కరించనున్నారు. ఆ దరఖాస్తుల్లో తేలే అర్హులను ముసాయిదా జాబితాతో జతపరచి తుది జాబితాను ప్రకటిస్తారు.

ముసాయిదా పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరగనుంది. 2022లో ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్లా మూడు లక్షలకుపైగా ఉంది. రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం కొత్త జాబితానే కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుంది. తుది జాబితా ప్రకటించాక కూడా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అర్హులు ఎవరైనా మిగిలిపోతే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.