ETV Bharat / state

Effect Of Sun On Crops: జనమే కాదు పైర్లు సైతం ఎండలకు విలవిల..

author img

By

Published : May 4, 2022, 5:50 AM IST

Effect Of Sun On Crops: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం జనంపైనే కాకుండా.. పంటలపై కూడా అధికంగా ప్రభావం చూపుతోంది. దీనివల్ల పూత, కాత, దిగుబడి తగ్గుతున్నాయి.

Crops
Crops

Effect Of Sun On Crops: అధిక వేడి, పొడి వాతావరణం పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పూత, కాత, దిగుబడి తగ్గుతున్నాయి. తెలంగాణ వాతావరణం, భూముల్లో సాగుచేసే పంటలు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే తట్టుకోలేవని.. ప్రస్తుతం సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో 10 నుంచి 15 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉందని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు(డైరెక్టర్‌) డాక్టర్‌ జగదీశ్వర్‌ పేర్కొన్నారు. వరితో పాటు కూరగాయలు, ఇతర పంటల్లో రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ తెగుళ్ల దాడి ఉద్ధృతంగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో గుర్తించినట్లు ఆయన తెలిపారు. వంగ తోటల్లో కొమ్మ, కాయతొలుచు, మిరపలో తామర పురుగు, మామిడిలో తేనేమంచు పురుగు, పిండినల్లి, పొలుసు పురుగు, పండు ఈగలు అధికంగా ఉన్నాయన్నారు. ఎండల ధాటికి కూరగాయల దిగుబడి పడిపోవడంతో ధరలూ మండుతున్నాయి. పక్షం రోజుల క్రితం టమాటా ధర రూ.10లోపు ఉండగా ఇప్పుడు రూ.50కి చేరింది.

* అధిక ఎండలకు కోళ్లఫారాలు, పాడి పశువుల నిర్వహణ రైతులకు భారంగా మారింది. కోళ్లకు కొక్కెర తెగులు సోకే అవకాశం ఉందని, దీని నివారణకు వాటికి టీకాలు వేయించాలని జయశంకర్‌ వర్సిటీ సూచించింది. కోళ్ల ఫారాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, రేకుల షెడ్లపై వరిగడ్డి కప్పి నీటి తుంపర్లు పడేలా తుంపర యంత్రాలు ఏర్పాటు చేయాలంది. వాటికి చల్లని తాగునీటిని ఏర్పాటు చేయాలని తెలిపింది. అధిక ఎండలను తట్టుకోలేక కోళ్లు చనిపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర కోళ్లఫారాల సమాఖ్య అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలిపారు.

* అధిక ఎండలకు పాల ఉత్పత్తి తగ్గుతుందని పశువులను సాధారణ ఉష్ణోగ్రతల్లో ఉంచి కాపాడుకోవాలని పశువైద్యశాఖ హెచ్చరించింది. పాడి ఆవులు, గేదెల్లో గొంతువాపు, గాలికుంటు వ్యాధులు సోకే అవకాశముందని.. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ధాన్యాన్ని నీడలో ఆరబోస్తే మేలు: రాష్ట్రంలో ప్రస్తుతం వరి కోతలు చివరి దశలో ఉన్నాయి. యాసంగి సీజన్‌లో సాగు ఆలస్యం కావడం ఇందుకు కారణం. యంత్రాలతో పంటను కోసి.. ధాన్యాన్ని నేరుగా ట్రాక్టర్‌ ట్రాలీల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంటోందని, బాగా ఆరబెడితేనే మద్దతు ధర వస్తుందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కొన్ని కేంద్రాల వద్ద వారం, 10 రోజులకు పైగా ధాన్యాన్ని రైతులు మండుటెండల్లో ఆరబోస్తున్నారు. కొందరు రైతులు నేరుగా తారురోడ్లపైనే ఆరబోస్తున్నారు.

అయితే భానుడి సెగలకు తోడు తారురోడ్డు వేడి ధాన్యంపై చూపే ప్రభావంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అధిక ఎండలకు ధాన్యం పెళుసుబారి రైస్‌మిల్లుల్లో మరపట్టినప్పుడు ముక్కలై నూకలు అధికంగా వస్తాయి. నూక శాతాన్ని తగ్గించడానికి మిల్లుల్లో పారాబాయిల్డ్‌(ఉప్పుడు బియ్యం)గా మారుస్తుంటారు. అయితే ఉప్పుడు బియ్యాన్ని మద్దతు ధరకు కొనేది లేదని.. సాధారణ బియ్యమే తీసుకుంటామని కేంద్రం చెబుతున్న విషయం విదితమే. ఎండలో ఆరబోస్తేనే తేమ తగ్గుతుందనే అపోహ చాలామందిలో ఉందని.. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎండలో ఆరబోస్తే ధాన్యం పెళుసుబారుతుందని, మరపట్టించినప్పుడు నూకలు అధికంగా వస్తాయని జగదీశ్వర్‌ తెలిపారు. కాస్త నీడలో ఆరబోసినా తేమ తగ్గుతుందని, తద్వారా గింజలను మరపట్టినప్పుడు నూకలు ఎక్కువగా రాకుండా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట రేకుల షెడ్ల నీడలో ధాన్యం ఆరబోసినా ధాన్యంలో తేమ తగ్గుతుందని వివరించారు.

ఇదీ చదవండి: 'త్వరలో పాదయాత్ర చేపడతా.. దమ్ముంటే ఆపండి'

పారిశుద్ధ్య కార్మికుల కోసం చెన్నై ఐఐటీ విద్యార్థుల వినూత్న రోబో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.