ETV Bharat / state

మంత్రి గంగుల ఇంట్లో ఈడీ సోదాలు.. తాళాలు పగులగొట్టించి మరీ!

author img

By

Published : Nov 9, 2022, 8:15 PM IST

Updated : Nov 10, 2022, 6:28 AM IST

ED and IT Raids in Telangana: ఇటీవలే దిల్లీ మద్యం కేసు, స్థిరాస్తి సంస్థలపై దాడులు చేసిన ఈడీ, ఐటీ శాఖలు... గ్రానైట్‌ సంస్థలపై దృష్టి సారించాయి. తక్కువ మొత్తంలో ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం సహా... అక్రమ మార్గంలో లబ్ది పొందారంటూ అందిన ఫిర్యాదులతో హైదరాబాద్‌, కరీంనగర్‌లోని సంస్థల కార్యాలయాలు, యజమానుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ విదేశీ పర్యటనలో ఉన్నా... తాళాలు తీయించి ఇంట్లో సోదాలు చేశారు.

ED
ED

రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఈడీ, ఐటీ అధికారుల దాడులు

ED and IT Raids in Telangana: రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ, ఆదాయ పన్ను-ఐటీ శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనిఖీలు చేసిన దర్యాప్తు సంస్థలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుండగానే... తాజాగా కొన్ని గ్రానైట్‌ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలతో ఈడీ, ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్‌ రావు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్​జీటీ, కేంద్ర పర్యావరణశాఖకు... గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించారు. అదే విషయంపై 2019లో బండి సంజయ్‌ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ రెండు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్‌, కరీంనగర్‌లోని గ్రానైట్‌ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ సోమాజీగూడలోని.. పీఎస్​ఆర్ గ్రానైట్స్ కార్యాలయం, హైదర్‌గూడ ఉప్పరపల్లిలోని... ఎస్​వీజీ గ్రానైట్స్ అధినేత ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎగుమతులు చేపట్టారనే సమాచారంతో.. కంపెనీ అధినేత శ్రీధర్‌రావుకి కరీంనగర్‌లోని మూడు గ్రానైట్ క్వారీలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్వారీల నుంచి గోదాంలో ఉంచిన గ్రానైట్‌ను పోర్టులకు తరలించండంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు అధికారులు భావిస్తున్నారు. హిమాయత్ నగర్​లోని శ్వేతా గ్రానైట్స్ సహా బంజారాహిల్స్​లోని గ్రానైట్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. తెల్లవారుజాము నుంచే అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి దాడులు చేశారు. గ్రానైట్ సంస్థలు హవాలా, మనీలాండరింగ్, అక్రమ మైనింగ్‌లతో నిబంధనలకు విరుద్ధంగా ఎగుమతులు చేపట్టారనే సమాచారం మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి ఇంటి తాళాలు తీయించి అధికారుల సోదాలు.. కరీంనగర్‌లోని ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఐటీ శాఖ అధికారులు సంయుక్తంగా సోదాలు చేపట్టారు. క్రిస్టియన్‌ కాలనీలోని మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో అధికారులు సోదాలు చేసేందుకు వెళ్లారు. మంత్రి గంగుల కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉండటంలో... తాళం తీసే వ్యక్తిని తీసుకొచ్చి తనిఖీలు నిర్వహించారు. గంగుల కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. కమాన్‌రోడ్డులోని అరవింద్‌ గ్రానైట్స్‌, మంకమ్మతోటలోని శ్వేత గ్రానైట్స్‌ సహా గ్రానైట్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. లేబర్‌అడ్డాలోని టీఎస్​ఆర్ కంపెనీ సహా బావుపేటలో ఉన్న పలు గ్రానైట్స్‌ వద్ద సోదాలు చేపట్టారు.

కరీంనగర్‌ గ్రానైట్‌కు విదేశాల్లో డిమాండ్ ఉండటంతో... రాష్ట్ర ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న ఎకరాల కంటే... ఎక్కువస్థలంలో మైనింగ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. తద్వారా పర్యావరణానికి నష్టం వాటిల్లడంతో పాటు, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో 9 మైనింగ్ సంస్థలకు ప్రభుత్వం 750 కోట్లు జరిమానా విధించినా... చెల్లించకుండా అక్రమ మార్గంలో మినహాయింపు పొందినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చింది. కరీంనగర్‌ గ్రానైట్‌కు విదేశాల్లో డిమాండ్ ఉండటంతో... పెద్దమొత్తంలో చైనాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎగుమతి చేసిన గ్రానైట్‌కు కాకుండా... తక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించినట్లు కరీంనగర్ గ్రానైట్ సంస్థలపై ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో ఈడీ అధికారులు పూర్తిస్థాయి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ కంపెనీల్లో విలువైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈడీ అధికారులు మాత్రం వాటిని నిర్ధారించడం లేదు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 10, 2022, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.