DENGUE FEVER: విజృంభిస్తున్న డెంగీ.. చిన్నారులతో ఆస్పత్రులు కిటకిట

author img

By

Published : Sep 5, 2021, 6:49 AM IST

Updated : Sep 5, 2021, 6:58 AM IST

DENGUE FEVER, dengue in children

చిన్నారులపై డెంగీ పంజా విసురుతోంది. నిలోఫర్​లో 9 చిన్నపిల్లల యూనిట్లు నిండిపోయాయి. నెల నుంచి 12 ఏళ్లలోపు దాదాపు 700-750 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 30-40 శాతం మందిలో డెంగీ లక్షణాలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

రాష్ట్రవ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ముఖ్యంగా చిన్నారులపై పంజా విసురుతోంది. నిలోఫర్‌లో 9 చిన్నపిల్లల యూనిట్లు చిన్నారులతో నిండిపోయాయి. ఎన్‌ఐసీయూ(NICU)లో 250 మంది వరకు పిల్లలు చికిత్స పొందుతున్నారు. నెల నుంచి 12 ఏళ్లలోపు దాదాపు 700-750 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 30-40 శాతం మందిలో డెంగీ లక్షణాలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పడకలన్నీ పిల్లలతో నిండిపోయాయని వైద్యులు తెలిపారు. నిత్యం వెయ్యి మందికి తక్కువ కాకుండా ఓపీ ఉంటోంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఆ సంఖ్య 1200 దాటుతోంది. గాంధీ ఆస్పత్రిలోనూ డెంగీతో చిన్నారులు చేరుతున్నారు. గత రెండు వారాల్లో 80 మంది వరకు చిన్న పిల్లలు డెంగీతో చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించడంతో 3, 8, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురతో పాటు ఆరేళ్ల బాలిక కన్నుమూశారు. ఈ నలుగురు ఆఖరి దశలో చికిత్స కోసం గాంధీలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మరో 24 మంది పిల్లలు డెంగీ చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కొందరి పిల్లల్లో డెంగీతో పాటు కరోనా, టైఫాయిడ్‌, స్క్రబ్‌టైపస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ బాలిక(5) ఈ నాలుగు లక్షణాలతో ఇటీవల గాంధీలో చేరింది. ఆరోగ్యం విషమంగా మారడంతో అత్యవసర చికిత్స అందించారు. 16 రోజుల చికిత్స అనంతరం కోలుకోవడంతో శనివారం డిశ్ఛార్జి చేశారు.

నీరు నిల్వతో దోమల బెడద

ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఎక్కడపడితే అక్కడ నీరు నిల్వ ఉండి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. పలు పాఠశాలల వద్ద పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుండటంతో కొందరు చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. వీధులు, కాలనీల్లో మురుగునీరు, చెత్త డంపింగ్‌ ప్రాంతాలు దోమలు ప్రబలడానికి కారణమవుతున్నాయి. డెంగీకి కారణమయ్యే టైగర్‌ దోమ పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవటానికి వెళుతున్న చిన్నారులు దోమ కాటుకు గురవుతున్నారు.

ఆఖరి నిమిషం వరకు ఆగొద్దు

డాక్టర్‌ సుచిత్ర
  • పిల్లల్లో డెంగీతో పాటు కరోనా, మలేరియా, టైఫాయిడ్‌, స్క్రబ్‌టైపస్‌ జ్వరాలు పెరుగుతున్నాయి. ఆఖరి నిమిషంలో వైద్యులను సంప్రదించడం వల్ల కొన్నిసార్లు పరిస్థితి విషమంగా మారుతోంది.
  • పాఠశాలలకు వెళ్లే పిల్లలకు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరింపచేయాలి. మాస్క్‌, శానిటైజర్‌ తప్పకుండా ఉంచాలి.
  • పిల్లలు లేదా పెద్దలకు జ్వరం వస్తే పారాసిటమాల్‌ తప్ప... వైద్యుల సూచనల లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. 24-48 గంటల్లో తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి. కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి.
  • 101 డిగ్రీల కంటే జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, చలిజ్వరం, వాంతులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వంటిపై దద్దుర్లు, నీరసం, అలసట, రక్తంలో ఆక్సిజన్‌ తగ్గడం, బీపీ తగ్గిపోవడం, శరీర భాగాల నుంచి రక్తస్రావం కావడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలి.

-డాక్టర్‌ సుచిత్ర, చిన్న పిల్లల వైద్యులు, గాంధీ ఆసుపత్రి

ఇదీ చదవండి: Bullettu bandi: బుల్లెట్టు బండి క్రేజ్... డుగ్గు డుగ్గు బండి స్కూల్ వెర్షన్ 2.O

Last Updated :Sep 5, 2021, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.