ETV Bharat / state

మరోవారంలో రాష్ట్రానికి టీకా... తొలుత 10 లక్షల డోసులు

author img

By

Published : Jan 5, 2021, 6:58 AM IST

మరో వారంరోజుల్లో కొవిడ్‌ టీకా రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ టీకా పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మరో వారంలో రాష్ట్రానికి టీకా... తొలుత 10 లక్షల డోసులు
మరో వారంలో రాష్ట్రానికి టీకా... తొలుత 10 లక్షల డోసులు

మరో వారం రోజుల్లో కొవిడ్‌ టీకా రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోయినా.. ఈ మేరకు సంకేతాలున్నట్లుగా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ టీకా పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

దేశంలో రెండు టీకాలకు ఇప్పటికే అనుమతులు లభించిన నేపథ్యంలో.. తెలంగాణకు ముందుగా ఏ టీకాను సరఫరా చేస్తారనే విషయంలో కేంద్రం నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదని వైద్యవర్గాలు చెప్పాయి. తొలుత 10 లక్షల డోసులు వస్తాయనే సమాచారం. త్వరలో టీకాల పంపిణీ ప్రారంభం కానుండడం వల్ల అన్ని జిల్లాల వైద్యాధికారులు, టీకా పంపిణీ అధికారులు, వైద్యులతో సోమవారం ఎస్‌ఆర్‌నగర్‌లోని భారతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ..

* ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రుల వరకూ, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కలుపుకొని మొత్తంగా 1,500 కొవిడ్‌ టీకా కేంద్రాలను తొలుత నిర్వహిస్తారు.

* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక టీకా కేంద్రం, ఉస్మానియా, గాంధీ వంటి పెద్దాసుపత్రుల్లో 4 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేస్తారు.

* ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ.. గంట భోజన విరామం అనంతరం తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ టీకా వేస్తారు.

* తొలిరోజు అన్ని కేంద్రాల్లోనూ కేవలం 50 మందికి మాత్రమే టీకా వేస్తారు. ఆ తర్వాత నుంచి నిత్యం 100 మందికి చొప్పున పెంచుతారు.

* ఒక గంటలో ఎంతమందికి టీకా ఇవ్వాలనేది ముందే నిర్ణయిస్తారు. ఆయా సమయాల్లోనే టీకాలు పొందడానికి అర్హులు రావాల్సి ఉంటుంది.

* టీకా కేంద్రంలో 3 గదులను ఏర్పాటు చేస్తారు. వేచి చూడడం, టీకా పొందడం, దుష్ఫలితాలను పరిశీలించడం.. తదితర ప్రక్రియలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకుంటారు.

* రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగిస్తున్న సార్వత్రిక టీకా అమలు కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా... కొవిడ్‌ టీకా పంపిణీని నిర్వహించనున్నారు.

* ప్రస్తుతం ఇతర టీకాలు వేసేందుకు ఆదివారం సెలవు. బుధ, శనివారాల్లో చిన్నారులు, గర్భిణీలకు టీకాలు వేస్తున్నారు. దీంతో ఈ మూడు రోజులు మినహాయించి, మిగిలిన 4 రోజుల్లో కొవిడ్‌ టీకాలను ఇస్తారు.

* టీకా పొందడానికి ఎవరైనా నిరాకరిస్తే... వారిలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తారు. అయినా నిరాకరిస్తే బలవంతంగా టీకా ఇవ్వరు. కొవిడ్‌ టీకా పొందడం స్వచ్ఛందమేనని అధికారులు వెల్లడించారు.

* మొదటి రెండు వారాలు వైద్యసిబ్బందికి టీకాలిచ్చిన అనంతరం పోలీసు, పురపాలక, రెవెన్యూ సిబ్బందికి ఇస్తారు.

* 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్లలోపు ఉండి.. దీర్ఘకాలంగా జబ్బులతో బాధపడుతున్నవారికి టీకా ఇచ్చే విషయంలో కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. దీంతో వీరికి టీకాలు వేయడానికి కొంత సమయం పడుతుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

* టీకాల పంపిణీపై ఇప్పటికే రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ఏడు ఆసుపత్రుల్లో డ్రైరన్‌ నిర్వహించగా.. ఇదే విధానాన్ని రాష్ట్రంలోని 1,200 ఆసుపత్రుల్లో వచ్చే గురు, శుక్రవారాల్లో నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా లోటుపాట్లను గుర్తించి చక్కదిద్దుకోనుంది.

దేశానికి గర్వకారణం: గవర్నర్‌ తమిళిసై

భారతీయ సంస్థలు తయారు చేసిన కరోనా నివారణ టీకాలకు అనుమతి రావడం దేశానికి గర్వకారణమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. దీని ద్వారా శాస్త్రవేత్తల సమర్థత ప్రపంచానికి తెలిసిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వారిని ప్రశంసించిందన్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర వైద్యకళాశాలలో సోమవారం జరిగిన ఓ సదస్సులో గవర్నర్‌ దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు. టీకాల తయారీ కోసం సంస్థలు, శాస్త్రవేత్తలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహించిందన్నారు.

ఇదీ చూడండి: తొలి డోసు ఎక్కడ తీసుకుంటే.. రెండోదీ అక్కడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.