ETV Bharat / state

Congress Latest News : అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్​ ఫోకస్.. త్వరలోనే మరిన్ని కమిటీలు!

author img

By

Published : Jul 21, 2023, 10:34 AM IST

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల 37మందితో ప్రచార కమిటీ వేసిన ఏఐసీసీ తాజాగా 26మందితో కీలకమైన ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. వ్యూహ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీలు కూడా త్వరలో రానున్నాయి. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్ని ప్రియాంక గాంధీకి అప్పగించనున్నారు. ఎన్నికల కమిటీలో చోటు దక్కని కొందరు సీనియర్‌ నేతలు అసంతృప్తితో ఉన్నారు.

Telangana Congress
Telangana Congress

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి

Congress focuses on Telangana assembly elections : శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో కాంగ్రెస్‌ తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఘర్‌ వాపసీ, చేరికలతో జోష్‌ పెరగడంతో ఉత్సాహంగా ఉరక లేస్తోంది. కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తెస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈనెల 23న జరగనున్న రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రచార వ్యూహాలు, చేరికలు వంటి అంశాలపై చర్చించనున్నారు.

ఇటీవల 37 మందితో ప్రచార కమిటీ నియమించిన అధిష్ఠానం తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌గా 26మందితో కీలకమైన ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఎన్నికల కమిటీలో సామాజిక న్యాయం జరిగిందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇరవత్రి అనిల్ వంటి నాయకులకు కమిటీలో స్థానం దక్కలేదు. తనను కమిటీలోకి తీసుకోకపోవడంపై పొన్నం ప్రభాకర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎన్నికల కమిటీలో చోటు దక్కడంపై విమర్శలు వస్తున్నాయి.

కమిటీలో సభ్యుల సంఖ్య కుదించడం వల్లే కొందరికి అవకాశం దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ చేపట్టబోయే కార్యక్రమాల్ని ఎన్నికల కమిటీలో చర్చించి ఆమోదించాల్సి ఉంటుంది. ప్రచార వ్యూహాలు, డిక్లరేషన్ల తయారీ, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై సమాలోచనలు జరుపుతారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, గెలుపు గుర్రాల కోసం నియోజకవర్గాల వారీగా ఆశావహులతో చర్చలు జరపడం వంటి బాధ్యతల్ని ఎన్నికల కమిటీ నిర్వర్తించాల్సి ఉంటుంది.

కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు నుంచి నలుగురు నేతలు టిక్కెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వారితో చర్చించి బుజ్జగించాల్సి ఉంటుంది. సర్వేలు, ఎన్నికల కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని పీసీసీ స్పష్టం చేస్తోంది. విమర్శలకు తావు లేకుండా అభ్యర్థుల ఎంపిక జరగాలని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికార బీఆర్​ఎస్​ అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చిందని తెలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ తన పనిని వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

Congress preparing for Telangana assembly elections : దేశంలో ఐదు రాష్ట్రాలల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా ఎన్నికల కమిటీ వేయడం ద్వారా ఆ పార్టీ కార్యకలాపాలు వేగవంతం చేసింది. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసిన హస్తం పార్టీ త్వరలో జరగనున్న ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.