ETV Bharat / state

ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కోడింగ్.. రోబోటిక్స్​పై ప్రయోగాలు!

author img

By

Published : Sep 13, 2021, 10:08 AM IST

ప్రస్తుతం సాంకేతిక యుగంలో కోడింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకే కాకుండా మరెన్నో ఇతర రంగాల్లో స్థిరపడాలనుకునే యువతకు కోడింగ్‌ తప్పనిసరి. ఎంతో మంది యువత ఉద్యోగసాధనలో భాగంగా నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కోడింగ్ నేర్పించే యోచనలో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

coding-and-experiments-on-robotics
విద్యార్థులకు కోడింగ్

ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం కోడింగ్‌ నేర్చుకోనున్నారు. తెలంగాణ విద్యాశాఖ, లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌(ఎల్‌ఎల్‌ఎఫ్‌), డెల్‌ టెక్నాలజీస్‌ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కోడింగ్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే విద్యార్థుల్లోని సృజనను వెలికితీసేందుకు వీలుగా ‘స్టెమ్‌’(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) ఆధారిత ప్రయోగాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా కిట్లు అందించనున్నారు.

ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వీలుగా

కోడింగ్‌తోపాటు ప్రయోగాలు చేయించేందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో రెండు జిల్లాల్లో చెరో 20 చొప్పున ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మరో పది తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్‌ బడులున్నాయి. వాటిల్లో చదివే ఆరు నుంచి పదో తరగతి పరిధిలోని 20వేల మంది విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా డీఈవో సుశీంద్రరావు, హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త ఎస్‌.రజిత, డెల్‌ కంపెనీ సైట్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ సిన్హా, లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ నురియా అన్నారి సంయుక్తంగా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

రోబోటిక్స్‌పై ప్రయోగాలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ‘స్టెమ్‌’ ఆధారిత ప్రయోగాలు చేపట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో వివిధ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీల భాగస్వామ్యం తీసుకుంటుంది. తాజాగా ఎల్‌ఎల్‌ఎఫ్‌, డెల్‌ సాయంతో రోబోటిక్స్‌, ఎల్‌ఈడీ, ట్రాన్సిస్టర్స్‌ నమూనాల తయారీకి విద్యార్థులతో ప్రయోగాలు చేయించనున్నారు. ప్రతివారం ఎల్‌ఎల్‌ఎఫ్‌ రిసోర్స్‌ పర్సన్‌ పాఠశాలను సందర్శించి కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. ఎంపిక చేసిన ప్రతి పాఠశాలకు ప్రయోగాలకు అవసరమైన కిట్లను ఆయా సంస్థలు అందించనున్నాయి. వాటి సాయంతో విద్యార్థులు నిత్య జీవితంలోనే కాక సమాజపరంగా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు వినూత్న మార్గాల్లో ప్రయోగాలు చేస్తారు. దీనివల్ల విద్యార్థుల్లోనూ సృజనాత్మకత పెరుగుతుందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. పాఠ్యాంశాల పరంగానూ ఉపాధ్యాయులు ఆయా కిట్లతో బోధించేందుకు వీలు కలగనుంది.

ఇదీ చూడండి: Engineering colleges: ఏడాది ఫీజులన్నీ ఒకేసారి! ఇంజినీరింగ్‌ కళాశాలల ఇష్టారాజ్యం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.