Telangana Decade Celebrations 2023 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణకు హరితోత్సవం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. అన్ని గ్రామాలు, పట్టణాల్లో తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. హరితోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పచ్చదనం పెరిగేందుకు 8 ఏళ్లుగా కృషి చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. తాను హరితహారం అంటే.. చాలా మంది హాస్యాస్పదం చేశారని, కాంగ్రెస్ నేతలు జోకులు వేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే కార్యక్రమం వల్ల తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని ఆయన స్పష్టం చేశారు.
Haritha Usthavam at Tummaluru Urban Forest Park : పచ్చదనం పెంపులో సర్పంచులను అభినందిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో పచ్చదనం మరింత పెంచాలని సర్పంచులను కోరుతున్నానన్నారు. సొంత పిల్లలను పెంచినట్లు మొక్కలను సాకాలని కోరుతున్నానన్న సీఎం.. అటవీ శాఖ అధికారులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణం బాగుంటేనే మన జీవితాలు బాగుంటాయన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో ఇప్పటికే 276 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. అడవులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కలు ఇచ్చేందుకు చర్యలు చేపడతామన్న కేసీఆర్.. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించాలని నిర్ణయించామన్నారు.
''రాష్ట్రంలో పచ్చదనం పెరిగేందుకు 8 ఏళ్లుగా కృషి చేశాం. పచ్చదనం పెంచిన సర్పంచులను అభినందిస్తున్నా. గ్రామాల్లో పచ్చదనం మరింత పెంచాలని సర్పంచులను కోరుతున్నా. నేను హరితహారం అంటే చాలా మంది కాంగ్రెస్ నేతలు జోకులు వేశారు. అడవులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం. పర్యావరణం బాగుంటేనే మన జీవితాలు బాగుంటాయి. రాష్ట్రంలో ఇప్పటికే 276 కోట్ల మొక్కలు నాటాం. 7.7 శాతం పచ్చదనం పెరిగింది. ఇక నుంచి ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కలు ఇస్తాం. పండ్ల మొక్కల పంపిణీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.'' - సీఎం కేసీఆర్
కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో ఒకప్పుడు మనలను వెక్కిరించిన వారు.. నేడు ఏడో స్థానానికి పడిపోయారని ఎద్దేవా చేశారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, 24 గంటల విద్యుత్లో మనమే నెంబర్వన్ అన్న సీఎం.. అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకుంటూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలే అని కేసీఆర్ విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్నారని గుర్తు చేసిన సీఎం.. ప్రజలకు నీళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ క్రమంలోనే మహేశ్వరానికి వైద్య కళాశాల మంజూరు చేస్తామని తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి మహేశ్వరంలోని కందుకూరు వరకు మెట్రో తెచ్చేందుకు ప్రయత్నిస్తానన్న కేసీఆర్.. తుమ్మలూరుకు రూ.కోటితో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ హాల్కు దశాబ్ది పేరు పెట్టాలని కోరుతున్నానన్నారు. జల్పల్లి, తుక్కుగూడకు చెరో రూ.25 కోట్లు, బడంగ్పేట పురపాలికకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..
Telangana Haritha Utsavam 2023 : 'పుడమి పులకరించింది.. ప్రకృతి పరవశించింది'
Gutha Comments on Haritha Haram : 'హరితహారం.. దేశానికే ఆదర్శం'