ETV Bharat / state

CM on Raithu bandhu: అర్హులైన అన్నదాతల ఖాతాల్లో నగదు జమ: కేసీఆర్

author img

By

Published : Dec 19, 2021, 3:34 AM IST

‍CM on Raithu bandhu: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం పునరుద్ఘాటించారు. కేంద్ర వైఖరిని రైతులకు అర్థమయ్యేలా చెప్పడమే కాక ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల దిశగా అన్నదాతలను మళ్లించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రారంభించిన 10 రోజుల్లో అర్హులైన అన్నదాతల ఖాతాల్లో నగదు జమ పూర్తిచేస్తామని వెల్లడించారు. ఉద్యోగుల విభజనపైనా కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు. కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన ఉండాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. దళితబంధు నిధులను త్వరలోనే విడుదల చేస్తామన్న సీఎం హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలుచేస్తామని స్పష్టం చేశారు.

CM on Raithu bandhu
ప్రగతిభవన్‌లో కలెక్టర్లు, అధికారులతో సమావేశం

CM on Raithu bandhu: ప్రగతిభవన్‌లో కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనాపరమైనా అంశాలపై దిశానిర్దేశం చేశారు. యాసంగిలో ఒక్క కిలో వడ్లు కొనేది లేదని.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేదిలేదని పునరుద్ఘాటించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరిధాన్యం కొనబోమని పదేపదే చెబుతున్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి.. రైతులను కాపాడేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని వివరించాలని కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వానాకాలంలో పత్తి, వరి, కంది సాగుపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రైతులను ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల సాగుదిశగా.. సమాయత్తం చేయాలని సూచించారు. ఈ నెల 28 నుంచి రైతు బంధు పంపిణీ చేస్తామని వారం, పదిరోజుల్లో వరస క్రమంలో అందరి ఖాతాల్లో నిధులు జమవుతాయని తెలిపారు.
దళితబంధుతో తృప్తి

dalit bandhu:హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇప్పటికే ప్రకటించిన 4 మండలాల పరిధిలో దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే పథకం లక్ష్యమని పునరుద్ఘాటించారు. దళితబంధు ద్వారా పూర్తిరాయితీతో అందించే 10లక్షలు దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తాయని చెప్పారు. ఆ మొత్తం సామాజిక పెట్టుబడిగా మారి తెలంగాణ ఆర్థికవ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందన్నారు. ఇప్పటివరకు చేసిన ఏ పనిలోనూ లేని తృప్తి దళితబంధు అమల్లో లభిస్తుందని, ఇందుకు ఆకాశమే హద్దని తెలిపారు.

ప్రగతిభవన్‌లో కలెక్టర్లు, అధికారులతో సమావేశం

భార్యభర్తలు ఒకచోట పనిచేస్తే ..

cm on zonal system: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. నూతన జోనల్ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు క్షేత్రస్థాయిలో..ప్రభుత్వ పాలనకు అవకాశం ఉంటుందన్నారు. వెనకబడిన, మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వోద్యోగులు వెళ్లి.. పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఉద్యోగులైన భార్యాభర్తల ఒకే చోట పనిచేస్తే ప్రశాంతంగా విధులు నిర్వర్తిస్తారని.. ఉత్పాదకత పెరుగుతుందని కేసీఆర్‌ సూచించారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల్లో విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్‌ కేసు అంశాలను పరిష్కరించాలని ఆదేశించారు. కరోనా పరిస్థితి గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్‌...ఒమిక్రాన్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.