kcr meet amitshah: ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టులు పెంచండి.. అమిత్​షాకు సీఎం వినతి

author img

By

Published : Sep 5, 2021, 5:06 AM IST

kcr meet amitshah: ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టులు పెంచండి.. అమిత్​షాకు సీఎం వినతి
kcr meet amitshah: ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టులు పెంచండి.. అమిత్​షాకు సీఎం వినతి ()

తెలంగాణకు ఐపీఎస్​ క్యాడర్‌ పోస్టుల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి కేసీఆర్​ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో హోంమంత్రిని కలిసిన సీఎం... రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. చట్టం పార్లమెంటు ఆమోదం పొంది ఏడేళ్లు పూర్తయినా అందులో పొందుపర్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపినట్లు సమాచారం.

తెలంగాణకు ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టుల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అమిత్‌షాను ఆయన అధికారిక నివాసం 6ఏ, కృష్ణమేనన్‌ మార్గ్‌లో ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం కలిశారు. సాయంత్రం 3.15 గంటలకు హోంమంత్రి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి 3.55 గంటలకు బయటకు వచ్చారు. సుమారు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. ఐపీఎస్‌ అధికారుల సంఖ్య పెంపుతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు నెరవేర్చాలని అమిత్‌షాను సీఎం కేసీఆర్‌ కోరారు. రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లకు పాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజించినట్లు తెలిపారు. ఫలితంగా కొత్త జోన్లు, మల్టీ జోన్లు ఏర్పడ్డాయని, అందుకు తగినట్లు పోలీసు శాఖలో మార్పులు చేసినట్లు తెలిపారు. 2016లో కేంద్ర హోంశాఖ ఐపీఎస్‌ల క్యాడర్‌పై సమీక్షించిందన్నారు. అయితే జిల్లాల పునర్విభజన తర్వాత పోలీసు శాఖలో జరిగిన మార్పులతో అదనంగా 29 డ్యూటీ పోస్టుల్లో సీనియర్‌ అధికారుల అవసరం ఏర్పడిందని వివరించారు.అందువల్ల సీనియర్‌ డ్యూటీ పోస్టుల సంఖ్యను 105కు పెంచాలని, ఐపీఎస్‌ కేడర్‌ పోస్టుల సంఖ్యను 139 నుంచి 195కు పెంచాలని కోరారు. కొత్త కమిషనర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఐజీపీల అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను ప్రత్యేక కేసుగా పరిగణించి ఐపీఎస్‌ క్యాడర్‌ సమీక్ష నిర్వహించి అందుకు అనుగుణంగా అధికారుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఏడేళ్లయినా...

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం పార్లమెంటు ఆమోదం పొంది ఏడేళ్లు పూర్తయినా అందులో పొందుపర్చిన పలు హామీలను నెరవేర్చలేదని సీఎం కేసీఆర్‌ అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వాటిని పరిష్కరించాలని కోరడంతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పన, దిల్లీలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయింపు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి అమిత్‌ షాను ఆహ్వానించినట్లు సమాచారం.

షెకావత్‌తో నేడు భేటీ లేనట్లే..

కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సమావేశం కావాలని భావించారు. అయితే గజేంద్రసింగ్‌ స్వరాష్ట్రం రాజస్థాన్‌లో ఉండిపోవడంతో భేటీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి: KCR Delhi tour : ఐపీఎస్‌ క్యాడర్ రివ్యూ చేపట్టాలని అమిత్​షాకు కేసీఆర్ వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.