ETV Bharat / state

CM KCR MUMBAI TOUR: మార్పునకు తరుణమిదే.. భాజపాను చిత్తుగా ఓడించాల్సిందే

author img

By

Published : Feb 21, 2022, 5:35 AM IST

Updated : Feb 21, 2022, 7:10 AM IST

CM KCR MUMBAI TOUR: దేశంలో గుణాత్మక మార్పునకు సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే అభిప్రాయపడ్డారు. దేశ హితం కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిపై ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌ పవార్‌లతో చర్చించిన కేసీఆర్​​.. త్వరలో దేవెగౌడ, స్టాలిన్‌లతోనూ సమావేశం కానున్నారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

CM KCR MUMBAI TOUR: ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి.. భాజపాను చిత్తుగా ఓడించాలి
CM KCR MUMBAI TOUR: ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి.. భాజపాను చిత్తుగా ఓడించాలి

CM KCR MUMBAI TOUR: మార్పునకు తరుణమిదే.. భాజపాను చిత్తుగా ఓడించాల్సిందే

CM KCR MUMBAI TOUR: దేశంలో గుణాత్మక మార్పులకు, ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్‌, ఉద్ధవ్‌ ఠాక్రేలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కలిసి నడవాలని నిర్ణయించారు. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లనున్నట్లు చెప్పారు. దేశప్రజలు మార్పు కోరుకుంటున్నారని, భాజపా ముక్త్‌భారత్‌ కోసం ముంబయి వేదికగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశానికి రావాలని ఆయన ఠాక్రేను ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల బంధాన్ని దేశ ఐక్యత కోసం ఉపయోగిస్తామని, అన్ని అంశాలపై తాము ఏకాభిప్రాయానికి వచ్చామని ఉద్ధవ్‌ తెలిపారు. దేశ హితం కోసం కేసీఆర్‌తో కలిసి నడుస్తామన్నారు. జాతీయ రాజకీయాలు, దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై తాము చర్చించామని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భాజపాను చిత్తు చేద్దామని ఠాక్రే అన్నారు.

కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా కేసీఆర్‌ ఆదివారం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఠాక్రే అధికారిక నివాసంలో మూడు గంటల పాటు, ఆ తర్వాత శరద్‌పవార్‌ నివాసంలో రెండున్నర గంటల పాటు మంతనాలు జరిపారు. ఠాక్రేతో భేటీలో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలతో పాటు జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. అనంతరం వారిద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. తర్వాత కేసీఆర్‌ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో పవార్‌ ఆచితూచి మాట్లాడారు. తాము దేశ సమస్యలు, అభివృద్ధిపైనే చర్చించామని, రాజకీయాలు కాదని పవార్‌ నొక్కిచెప్పారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ముంబయికి వెళ్లిన కేసీఆర్‌ నేరుగా ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం ‘వర్ష’కు చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇద్దరూ సమావేశమయ్యారు. సీఎం వెంట ఎంపీలు రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్‌, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ సైతం ఉన్నారు. శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌, సీఎం ఉద్ధవ్‌ కుమారుడు తేజస్‌ ఠాక్రేలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్‌తో రాజకీయ పర్యటనలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకొంది.

శరద్‌పవార్‌తో కేసీఆర్‌ సమావేశం..

ఉద్ధవ్‌తో సమావేశం ముగిశాక కేసీఆర్‌ సాయంత్రం నాలుగు గంటలకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆ పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్‌, పవార్‌ కుమార్తె సుప్రియా సూలే కూడా పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. తెలంగాణకు మొదటి నుంచీ అండగా ఉన్నందుకు పవార్‌కు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నరేంద్రమోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మోదీ మాట్లాడారని తెలిపారు. తాజా రాజకీయాలు, కేంద్ర సర్కారు వివక్ష, రాష్ట్రాలపై పెత్తనం లాంటి విషయాలను కేసీఆర్‌ వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్‌ పవార్‌ ఇచ్చిన మద్దతును మరువలేం. దేశం ప్రస్తుతం సరైన మార్గంలో నడవడం లేదు. దళితుల వికాసం లేదు. సరైన పాలన లేదు. ఈ దిశగా తగిన ఎజెండా అవసరం. అత్యంత అనుభవం ఉన్న నేత శరద్‌ పవార్‌. కార్యాచరణపై ఆయనతో చర్చించాం. దేశానికి కొత్త దిశానిర్దేశం కావాలి. మమ్మల్ని పవార్‌ ఆశీర్వదించారు’ అని కేసీఆర్‌ చెప్పారు.

ఇది ఆరంభం మాత్రమే..

ఉద్ధవ్‌జీని కలవడం చాలా గొప్ప విషయం. మేం అన్నదమ్ముల్లాంటి వాళ్లం. దేశంలో రావాల్సిన మార్పులు, కేంద్ర విధానాలపై చర్చించాం. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు పురోగతి ఉంటుంది. మేం అందరితోనూ మాట్లాడతాం. కొద్ది రోజుల్లో హైదరాబాద్‌ లేదా మరెక్కడైనా సమావేశమై మరిన్ని విషయాలు చర్చిస్తాం. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సుదీర్ఘ ఉమ్మడి సరిహద్దు ఉంది. పరస్పర అవగాహనతో మరింత ముందుకెళతాం. - కేసీఆర్‌

మార్పుకోసం ఏదైనా చేస్తాం..

కేసీఆర్‌ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. మావి రెండూ సోదర రాష్ట్రాలు. మా చర్చల్లో రహస్యమేమీ లేదు. మార్పు కోసం ఏదైనా బహిరంగంగానే చేస్తాం. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది మంచిది కాదు. తెలంగాణ-మహారాష్ట్రలు ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులపై పరస్పరం సహకరించు కుంటాయి.

- ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

రాజకీయాలు మాట్లాడలేదు..

మోదీ సర్కారు అన్నింటా విఫలమైంది. మేం దేశాభివృద్ధి గురించే ఎక్కువగా మాట్లాడుకున్నాం. రాజకీయాల గురించి కాదు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. అవి దేశానికి ఆదర్శం. దేశాభివృద్ధికి కేసీఆర్‌ లాంటి నేతలు అవసరం. ఆయనతో కలిసి పనిచేస్తాం.

- శరద్‌ పవార్‌, ఎన్సీపీ అధినేత

త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ: కేసీఆర్‌..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఎన్నో సమస్యలు యథాతథంగా ఉన్నాయని, వీటన్నిటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ రాజకీయవేదిక అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్రలో ప్రారంభమైన ఏ ఉద్యమమైనా విజయవంతమైందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. త్వరలోనే అన్ని ప్రాంతీయ పార్టీలతో పూర్తిస్థాయిలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఛత్రపతి శివాజీ, బాల్‌ ఠాక్రే వంటి యోధుల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పోరాడతామన్నారు. ఉద్ధవ్‌తో భేటీ సందర్భంగా కేంద్రంలో భాజపా వైఖరి, రాష్ట్రాల హక్కులను హరించడం, గవర్నర్‌ వ్యవస్థ, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడం తదితర అంశాలపై కేసీఆర్‌ చర్చించారు. గత ఏడున్నరేళ్ల ఎన్డీయే పాలనలో సంభవించిన పరిణామాలను వివరించారు. రాష్ట్రాలకు పన్నుల వాటాను ఎగ్గొట్టేందుకు కేంద్ర సర్కారు సెస్సులు పెంచుతోందని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాలకు మాత్రమే కొత్త ప్రాజెక్టులిస్తూ, ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని తెలిపారు. భాజపా వల్ల దేశానికి ముప్పు ఉందన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై సహాయ నిరాకరణ ద్వారా రైతుల్లో గందరగోళం సృష్టించిందని, పంటలకు మద్దతు ధరల విషయంలోనూ ఒక జాతీయ విధానం లేదని తెలిపారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా సాగు చట్టాలను రద్దు చేసిందని, ఎన్నికలయ్యాక మళ్లీ వాటిని తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. చమురు ధరలను కూడా ఎన్నికల ముందు తగ్గించి, మళ్లీ ఎన్నికల తర్వాత లీటరుకు రూ. పది చొప్పున పెంచేందుకు పథకం సిద్ధం చేసిందన్నారు. భాజపాను దేశం నుంచి పారదోలేందుకు కలిసి రావాలని కేసీఆర్‌ ఠాక్రేను కోరారు. మహారాష్ట్రతో తెలంగాణ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అందించిన సహకారాన్ని మరిచిపోమని, భవిష్యత్తులో వార్ధా బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. మహారాష్ట్ర అభ్యున్నతికి తాము సైతం అండగా ఉంటామన్నారు.

భాజపా వల్ల భారీగా నష్టపోయాం: ఠాక్రే..

భాజపా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఠాక్రే కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. ‘శివసేన ఆది నుంచీ భాజపాకు సహకరించింది. కానీ ఆ పార్టీ ఏ రోజూ శివసేన ఎదుగుదలకు సహకరించలేదు. గత ఎన్నికల్లో అధికారం మాకే ఇస్తామని చెప్పి మాట మార్చింది. శివసేన అధికారంలోకి వచ్చాక ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఇదే వైఖరిని అవలంబిస్తోంది. తెలంగాణ రైతులపై ఆ పార్టీ వైఖరి దారుణంగా ఉంది. రాష్ట్రాలపై పెత్తనానికి యత్నిస్తోంది. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలి. దేశంలో భాజపాకు ఎదురుగాలి వీస్తోంది. ఆ పార్టీని ఓడించేందుకు అన్ని విధాలా కలిసి వస్తాం’ అని ఉద్ధవ్‌ తెలిపారు. త్వరలోనే తాను హైదరాబాద్‌కు వస్తానని ఠాక్రే చెప్పినట్లు సమాచారం.

కేసీఆర్‌కు ముంబయిలో ఘనస్వాగతం..

మహారాష్ట్ర పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. ముంబయికి చేరుకున్న వెంటనే ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి తెలంగాణ ప్రవాసులు స్వాగతం పలికారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తమ నివాసం ‘వర్ష’ వద్ద కేసీఆర్‌ను సాదరంగా స్వాగతించారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కేసీఆర్‌ పోచంపల్లి శాలువాతో ఠాక్రేను సత్కరించి, రజత వీణను బహూకరించారు. ఇద్దరు సీఎంలు ఆరుబయటే లాన్ల్‌ో భోజనం చేశారు. అనంతరం కేసీఆర్‌ శరద్‌ పవార్‌ ఇంటికి వెళ్లగా పవార్‌ కుమార్తె సుప్రియా సూలె స్వాగతం పలికారు. కేసీఆర్‌ పవార్‌ను శాలువాతో సత్కరించి రజతవీణను కానుకగా ఇచ్చారు. కేసీఆర్‌ ముంబయి నుంచి బయల్దేరి రాత్రి 8.40గంటలకు హైదరాబాద్‌ చేరుకున్నారు. సుమారు ఎనిమిది గంటలపాటు కేసీఆర్‌ పర్యటన సాగింది.

సీఎం వెంట ప్రకాశ్‌రాజ్‌..

కేసీఆర్‌ పర్యటనలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రధానాకర్షణగా నిలిచారు. ముందు నిర్ణయించిన పర్యటన షెడ్యూలులో ఆయన పేరు లేదు. పర్యటన ముగిసేంతవరకు ప్రకాశ్‌రాజ్‌ సీఎం వెంటే ఉన్నారు. సీఎంతో, కేటీఆర్‌తో ప్రకాష్‌రాజ్‌కు గతం నుంచే సన్నిహిత సంబంధాలున్నాయి. కేసీఆర్‌ మొదటిసారి సీఎం అయినప్పుడు ప్రకాశ్‌రాజ్‌ను ప్రత్యేకంగా ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అప్పట్లో మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయినప్పుడు కూడా కేసీఆర్‌ తన వెంట ప్రకాశ్‌రాజ్‌ను తీసుకెళ్లారు. త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ కీలకం కానున్నారని చెబుతున్నారు. స్టాలిన్‌తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.

కాంగ్రెస్‌ పాత్ర మాటేమిటి?..

ఉద్ధవ్‌, శరద్‌పవార్‌లతో కేసీఆర్‌ చర్చల సందర్భంగా కాంగ్రెస్‌ రహిత కూటమి ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని, దాని సారథ్యం గానీ, భాగస్వామ్యం గానీ ప్రతికూలంగా పరిణమిస్తుందని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. కూటమి స్థాపన దిశగా చర్యలు చేపట్టి, జాతీయస్థాయి ప్రత్యామ్నాయమనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల గురించి కూడా వారిద్దరితో కేసీఆర్‌ చర్చించినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో సమర్థుడైన అభ్యర్థిని పోటీలో నిలపాలని, అందరూ ఏకమై ఎన్డీయే అభ్యర్థిని ఓడించాలని సూచించినట్లు సమాచారం.

మహారాష్ట్ర సీఎంవో ట్విటర్​లో​..

కేసీఆర్‌తో చర్చల అనంతరం ఉద్ధవ్‌ఠాక్రే తెరాసతో తాము కలిసి పనిచేస్తామనే అభిప్రాయాన్ని విలేకరులతో వెల్లడించారు. తమ సీఎంవో ట్విటర్‌లో మాత్రం ‘కేసీఆర్‌తో భేటీ సందర్భంగా పరిశ్రమలు, మౌలిక వసతులు, నీటిపారుదల, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్మాణంలో పరస్పర సహకారం గురించి చర్చించి’నట్లు తెలిపారు. ఠాక్రే, కేసీఆర్‌ మధ్య సమావేశం భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయ ఐక్యత ప్రక్రియను వేగవంతం చేస్తుందని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఆదివారం ట్విటర్‌లో పేర్కొంది.

ప్రత్యామ్నాయ కూటమిలో కాంగ్రెస్‌కి స్థానం లేదా అని విలేకరులు ప్రశ్నించగా, కేసీఆర్‌ సమాధానమిస్తూ... ‘ఇవాళ జరిగిన చర్చలు ఆరంభం మాత్రమే. దేశంలోని ఇతర నాయకులతోనూ చర్చించి ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వస్తాం. ప్రజల ముందు పెడతాం’ అని అన్నారు.

త్వరలో దేవేగౌడతో కేసీఆర్‌ భేటీ..

ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్‌ నేత దేవెగౌడతో భేటీ అయి చర్చించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

CM KCR Meet Sharad Pawar: దేశానికి కొత్త విజన్‌, సరైన అజెండా అవసరం: కేసీఆర్‌

Last Updated :Feb 21, 2022, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.