కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క , ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు. కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, సరైన చికిత్స అందించాలని కోరారు. తెరాస ప్రభుత్వం కరోనా బారిన పడ్డ రోగులకు కనీస చికిత్స అందించలేకపోతోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎంను కలుద్దామంటే సమయం ఇవ్వడం లేదని, ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ నిర్వాకం వల్ల ఉస్మానియా ఆస్పత్రి నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,000 పడకలు ఉన్నాయని చెబుతున్న సర్కార్... ప్రజల్లో ఎందుకు భరోసా కల్పించలేకపోతోందని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఒక డాక్టర్ ట్రాక్టర్ నడుపుతూ శవాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!