ETV Bharat / state

బోధన్‌ చలాన్‌ కుంభకోణం... దోపిడీ సొమ్ము ఎంతో తెలిస్తే షాక్‌!

author img

By

Published : Aug 9, 2022, 10:39 PM IST

Updated : Aug 9, 2022, 10:58 PM IST

Bodhan Fake Challans Scam Case:బోధన్ నకిలీ చలానాల కుంభకోణం కేసులో 280 కోట్ల రూపాయల దోపిడీ జరిగినట్లు CID అధికారులు నిర్ధరించారు. బోధన్ వాణిజ్య పన్నులశాఖ కార్యాలయం కేంద్రంగా దళారీ శివరాజ్‌ ముఠా ప్రభుత్వ సిబ్బందితో కలిసి ఖజానాకు కన్నం వేసినట్లు తేల్చారు. ఐతే ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంతనేది ఇంత కాలం చిక్కుముడిగానే మిగిలింది. మొదట్లో 500 కోట్ల వరకూ ఉండొచ్చని భావించినా ఇన్నాళ్లకు స్పష్టత వచ్చింది.

Bodhan Fake Challans Scam Case
Bodhan Fake Challans Scam Case

బోధన్‌ చలాన్‌ కుంభకోణం... దోపిడీ సొమ్ము ఎంతో తెలిస్తే షాక్‌!

Bodhan Fake Challans Scam Case: బోధన్ కేంద్రంగా జరిగిన వాణిజ్య పన్నులశాఖ నకిలీ చలానాల కుంభకోణం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012-17 మధ్య కాలంలో జరిగిన ఈ వ్యవహారంలో నిందితులు ఒకే చలానాను వేర్వేరు వ్యాపార సంస్థల పేర్ల మీద దస్త్రాల్లో నమోదుచేసి, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టారు. ఈ ఉదంతంలో దళారీగా వ్యవహరించిన శివరాజ్, అతని అనుచరులతోపాటు వాణిజ్య పన్నులశాఖ సిబ్బందిని అప్పట్లోనే అరెస్టు చేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు 2017లో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇద్దరు పన్ను సలహాదారులతో కలిసి అధికారులు, వ్యాపారులు, మిల్లర్లు కలిసిగట్టుగా వ్యాట్ ను చెల్లించినట్లుగా నకిలీ చలానాలు సృష్టించి.. ప్రభుత్వానికి జమ చేయకుండా పంచుకున్నారు. నకిలీ చలానాను ప్రోత్సహించిన బోధన్ సర్కిల్ ఏసీటీఓ విజయకృష్ణ, సీనియర్ అసిస్టెంట్లు వేణుగోపాలస్వామి, నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ హన్మాన్ సింగ్‌లను అప్పుడే సస్పెండ్ చేశారు. ఘటనకు కారకుడైన పన్ను సలహాదారుడు శివరాజ్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు.

కుంభకోణం సూత్రధారులు బోధన్ కార్యాలయం పరిధిలోని అన్ని సంస్థలు పన్ను చెల్లించినట్లు కంప్యూటర్ లో నమోదు చేశారు. ఆయా వ్యాపార సంస్థలకు పన్ను చెల్లించినట్లు నకిలీ చలానాలు చేతిలో పెట్టి ఆ సొమ్మును శివరాజ్ ఇంకా కొంతమంది సిబ్బంది తమ సొంతానికి మళ్లించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వసూలైన పన్నులన్నీ ఒకే ఖాతాలో జమవుతాయి. దాంతో సీఐడీ అధికారులకు బోధన్ కార్యాలయం నుంచి జమయిన పన్నులను వేరుచేయడం ఇబ్బంది అయింది.. ఈ నేపథ్యంలో అసలు ఎంత మేరకు పన్ను ఎగవేతకు గురైందనేది తేల్చే క్రమంలో సీఐడీ అధికారులు.. వాణిజ్య పన్నులశాఖ సర్వర్ కు ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించారు.

బోధన్ ఉప కార్యాలయం పరిధిలోని ఎన్ని వాణిజ్య సంస్థలకు ఎంతమేరకు పన్ను విధించారు.. అందులో ఆయా సంస్థలు వాస్తవంగా ఎంత పన్ను చెల్లించాయన్నది విశ్లేషించి కొల్లగొట్టిన మొత్తాన్ని నిర్ధారించారు. మొత్తంగా సంవత్సరానికి .56 కోట్ల చొప్పున ఐదేళ్లలో 280 కోట్లు దోపిడీ చేసినట్లు తేల్చారు. అంటే సగటున రోజుకు 15 లక్షలకు పైగానే కొల్లగొట్టారని తేల్చారు. దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వెల్లడయిన అంశాలు తిరుగులేని సాక్ష్యాలుగా మారుతాయని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

శివరాజ్ ముఠా 2012 నుంచి 2017 వరకూ ఐదేళ్లపాటు దోపిడీకి పాల్పడింది. దీని దర్యాప్తునకు కూడా సీఐడీకి ఐదేళ్లు పట్టడం గమనార్హం. ఇందులో ఇంకా మిగిలిపోయిన అంశాలపైనా దర్యాప్తు పూర్తిచేసి వీలైనంత త్వరలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 9, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.