ETV Bharat / state

Cannabis in Hyderabad: స్మగ్లర్లతో ఖాకీల దోస్తీ... నెలనెలా మూమూళ్లతో యథేచ్ఛగా గంజా దందా!

author img

By

Published : Oct 13, 2021, 4:33 PM IST

Cannabis in Hyderabad
Cannabis in Hyderabad

హైదరాబాద్​లో గంజాయి (Cannabis in Hyerabad) గుప్పుమనడం వెనుక పోలీస్ శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది హస్తం ఉన్నట్టు రుజువైంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లు వారికి నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలుసుకున్నారు. మంగళ్​హాట్ ఇన్​స్పెక్టర్ రణ్​వీర్ రెడ్డిపై వేటు వేశారు. ఆయనతో పాటు ఇద్దరు ఎస్సైలు రామునాయుడు, వెంకట్ కిషన్లను సస్పెండ్ చేశారు. వీరితో పాటు మరికొందరు అధికారులు కూడా గంజాయి మామూళ్లు తీసుకుంటున్నారని, స్మగ్లర్ల నుంచి నెలకు రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్నారని ప్రత్యేక విభాగం అధికారులు సమాచారం సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గ్రేటర్ పరిధిలో నెలకు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఈ మొత్తం ఉంటుందని సమాచారం.

హైదరాబాద్​లో గంజాయి (Cannabis in Hyderabad) విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ ఉన్నతాధికారులు 'గంజా ముక్తి హైదరాబాద్' (Ganja Mukthi Hyderabad) పేరుతో కొద్దిరోజుల క్రితం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ బయట నుంచి గంజాయి ఎలా వస్తుందో కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఓ గంజాయి స్మగ్లర్​ను ప్రత్యేక బృందం పోలీసులు అదుపులోకి తీసుకుంది.

అతడిని విచారించగా... తాము ఫలానా అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని, అందుకే గంజాయి తీసుకువచ్చినప్పుడు వారు మాకు సహకరిస్తారంటూ వివరించారు. స్మగ్లర్ తెలిపిన వివరాలపై ఆరా తీసిన పోలీసులు మంగళ్​హాట్, షాహినాయత్ గంజ్ పోలీస్ ఠాణాల్లో కొందరికి మామూళ్లు (Cannabis in Hyderabad) ముడుతున్నాయని ఆధారాలు సేకరించారు. ఇందులో ఇన్​స్పెక్టర్ రణ్​వీర్ రెడ్డి, ఇద్దరు ఎస్సైలు రామునాయుడు, వెంకట్ కిషన్​లు దొరికిపోయారు.

గుట్టుచప్పుడు కాకుండా...

రాజధాని నగరానికి గంజాయి ఎక్కువగా విశాఖ ఏజెన్సీ, గుల్బర్గా, బీదర్ నుంచి వస్తోంది. హైదరాబాద్(Cannabis in Hyderabad)​తో పాటు, మహారాష్ట్రలోని నాందేడ్, ముంబయిలకు గంజాయిని సరఫరా చేసేందుకు స్మగ్లర్లు ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారు. కూరగాయలు, ఇనుప వస్తువులు ప్లాస్టిక్ డబ్బాల మాటున గంజాయి రవాణా అవుతోంది. కచ్చితమైన సమాచారం వచ్చినప్పుటు మాత్రం డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు, పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రతిసారీ వందల కిలోలకు పైగా గంజాయి పట్టుబడుతోంది. విశాఖ ఏజెన్సీలో గంజాయి కిలో రూ.3వేలకు కొని, ఇక్కడ రూ. 7 వేల నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు.

గంజాయి నిర్మూలనే లక్ష్యం...

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని సీపీ అంజనీకుమార్ (Hyderabad Cp Anjani Kumar) తెలిపారు. 25 రోజుల్లోనే 148 మంది గంజాయి వ్యాపారులను అరెస్టు చేసి జైలుకు తరలించామన్నారు. ఇందులో 23మందిపై పీడీ చట్టం ప్రయోగించామని ఆయన వివరించారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై ఎలాంటి సమాచారమున్నా 9490616555 నంబర్​కు వాట్సాప్ చేయాలని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ సూచించారు.

ఇదీ చదవండి: Drugs Addiction: మత్తుకు యువత చిత్తు.. ఆందోళనకరంగా పరిస్థితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.