బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడానికి పెట్టడానికి ఎలాంటి అవరోధాలు లేవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. పాలకుల నిర్లక్ష్యంతోనే బీసీలు అన్యాయానికి గురవుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ నారాయణగూడలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని ప్రతి పౌరుడు అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగాలు లేక ప్రజలు రోడ్డున పడే ప్రమాదముందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యం కావాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ హయాంలోనే బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా ప్రతి ఒక్కరు ఉద్యమానికి సిద్ధం కావాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.