ETV Bharat / state

15 ఏళ్లు అయినా అందని పరిహారం - రేవంత్​ సర్కార్​పైనే బస్వాపూర్ రిజర్వాయర్​ నిర్వాసితుల ఆశలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 12:51 PM IST

Baswapur Project Compensation Delay : ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు నీటి సదుపాయం కోసం ఏర్పాటైన బస్వాపూర్ రిజర్వాయర్ కింద నిర్వాసితులకు న్యాయం జరగడం లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 11.30 టీఎంసీల సామర్థ్యంతో కూడిన ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తైనప్పటికీ కాలువల ఏర్పాటు పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగడం లేదు. నిర్వాసితులు తరచూ నిరసన కార్యక్రమాలు చేపట్టినా, గత ప్రభుత్వం స్పందించలేదు. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా ఇంకా పరిహారం, పునరావాసం చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న వేళ రేవంత్‌రెడ్డి సర్కారు సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Nrisimhasagar - Baswapur Reservoir In Yadadri Bhuvanagiri
Baswapur Project Compensation Delay

న్యాయం జరగలేదని బస్వాపూర్​ రిజర్వాయర్​ నిర్వాసితుల ఆవేదన

Baswapur Project Compensation Delay : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన నృసింహ సాగర్ - బస్వాపూర్ రిజర్వాయర్ ఇప్పటికీ పూర్తి స్థాయి వినియోగంలోకి రాలేదు. తీవ్ర వర్షాభావ, కరవు పీడిత ప్రాంతమైన ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో 0.8 టీఎంసీల నీటి సామర్థ్యంతో 2009లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రూపకల్పనకు అంకురార్పణ చేసింది. 650 ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించాలని ప్రభుత్వం యోచించి చర్యలు చేపట్టింది. అప్పట్లో చిన్న ప్రాజెక్టు ఏర్పాటు చేసినా, తక్కువ భూములే పోయినా రైతులు పెద్దగా భారం అనుకోలేదు. పైగా కొత్త ప్రాజెక్టు వచ్చింది కదా అని సంతోషపడ్డారు.

KTR Tweet: కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్రం సాయంపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

"ప్రాజెక్ట్​ భూసేకరణ కోసం 2013లో ఎకరానికి రూ.వేలల్లో ఇచ్చారు. అదే భూమి ప్రస్తుతం రూ.కోటి 50 లక్షల ధర పలుకుతుంది. నాలుగు ఎకరాలకు అప్పుడు రూ.12 లక్షలు వచ్చింది. వేరే చోట భూమి, డబుల్ ​బెడ్​రూం ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదు. భూములిచ్చి నాతో పాటు ఊరు మొత్తం ఆగం అయ్యాం. ప్రాజెక్టు నుంచి నీరు లీకేజీ అవుతుంది. మరమ్మతులు చేసినా నీటి వృథా అవుతూనే ఉంది."- ఉడత పోశయ్య, బాధిత రైతు

Nrisimhasagar - Baswapur Reservoir In Yadadri Bhuvanagiri : కానీ పరిణామ క్రమంలో రాష్ట్ర విభజన తర్వాత భూసేకరణ చేసి కొందరికి పరిహారం ఇవ్వగా, మరికొందరికి పరిహారం అందించకపోవడం, పునరావాసం కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో బాధిత రైతుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నృసింహసాగర్ - బస్వాపూర్ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం సేకరించిన భూములకు జూన్‌ నెలాఖరులోగా పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసే విధంగా ప్రభుత్వాల తీరు ఉందంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది మే 5వ తేదీన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ ప్రక్రియ మొదలు కాకపోవడంతో బాధిత రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది.

బస్వాపూర్​ రిజర్వాయర్​ నిర్వాసితుల నిరసన

"ప్రజా దర్బార్​ కార్యక్రమం ప్రారంభం కాగానే సీఎం రేవంత్​ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చాం. బాధితులకు సీఎం పరిహారం ఇస్తామని చెప్పారు. 2230 ఎకరాలు పూర్తి విస్తీర్ణం 1760 ఎకరాలు ముంపునకు గురైంది. పరిహారం కింద రూ.162 కోట్లు రావాల్సి ఉంది. డబ్బుల విడుదలకు సంబంధించి టోకెన్​ వచ్చినా పరిహారం ఏమైందో తెలియడం లేదు. 2013 చట్ట ప్రకారం డబ్బులు ప్రభుత్వం చెల్లించాలి." -శారదా ఆంజనేయులు, బీఎన్ తిమ్మాపూర్‌, ఎంపీటీసీ

ముఖ్యమంత్రి దృష్టికి : ఇటీవల ప్రజా దర్బార్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి త్వరలో పరిహారం, పునరావాస కల్పనకు చర్యలు తీసుకుంటామని సీఎం స్థానిక ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారని స్థానిక నేత చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ 16వ ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యంతో జిల్లాలో బస్వాపూర్‌ ప్రాజెక్ట్‌ కొలువైంది. నీటిని దిగువ భాగానికి మళ్లించేందుకు ప్రధాన కాల్వతో పాటు ఆయా ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటర్‌, మైనర్‌, సబ్‌ మైనర్‌ కాల్వలు నిర్మిస్తున్నారు. మొత్తం 13 డిస్ట్రిబ్యూటర్‌ కాల్వలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్‌ కెనాల్‌కు ఆయా ప్రాంతాలకు సాగు నీరందేలా మైనర్లు, సబ్‌ మైనర్లు, క్రాస్‌ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టారు.

పర్యాటక కేంద్రంగా నృసింహ రిజర్వాయర్‌ : ఇప్పటికే ఏర్పాటైన కాలువల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో తుంగ మొలుస్తోంది. కాలువలు దెబ్బతింటుంటే తొంగి చూసే తీరిక అధికారులకు లేదని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. పవిత్ర గోదావరి నీళ్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయనున్న ఈ నృసింహ రిజర్వాయర్‌ పర్యాటకంగా అలరించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు కనువిందు చేయనుంది.

'నష్టపరిహారం చెల్లించండి.. లేదంటే ప్రత్యామ్నాయం చూపండి'

'న్యాయం చేయకపోతే నిర్మాణ పనులను అడ్డుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.