కాషాయమయమైన భాగ్యనగరం.. భాజపా జాతీయ పండుగకు సంసిద్ధం..

author img

By

Published : Jul 1, 2022, 9:20 PM IST

Updated : Jul 1, 2022, 9:27 PM IST

భాజపా

Bjp national executive meeting: హైదరాబాద్ వేదికగా భాజపా జాతీయ పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ సహా భాజపా పాలిత ముఖ్యమంత్రులు, అగ్రనేతలు రానుండటంతో రాష్ట్ర నాయకత్వం దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికలు, కళారూపాలు సిద్ధం చేశారు. పరేడ్ గ్రౌండ్​లో జరిగే విజయ సంకల్ప సభతో తెలంగాణలో భాజపా గెలుపునకు నాంది పలుకుతామని నేతలు స్పష్టం చేస్తున్నారు.

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముస్తాబైన భాగ్యనగరం

Bjp national executive meeting: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబైంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలను భాగ్యనగర వేదికగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పార్టీ కీలకనేతలు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్​షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, 360మంది జాతీయ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సమావేశాలతోపాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో జూలై3న నిర్వహించబోయే భారీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

పరేడ్ గ్రౌండ్​లో నిర్వహించే బహిరంగ సభను ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ పరిశీలించారు. భాజపా కార్యవర్గ సమావేశాలకు 18మంది ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు , జాతీయ నాయకులు హాజరవుతున్నారని కిషన్​రెడ్డి తెలిపారు. సభ కోసం 15ప్రత్యేక రైళ్లు, వందలాది బస్సులు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు. సమావేశాలు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అవరోధాలు కల్పిస్తోందని కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో పుత్ర వాత్సల్యంతో శివసేన ఎలా కనుమరుగైందో తెలంగాణలోనూ తెరాస అదేవిధంగా పతనం అవుతుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలు ఉట్టిపడేలా సమావేశాల ప్రాంగణం, బహిరంగసభ వేదికలను సిద్ధం చేశారు. హెచ్ఐసీసీ నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా.. మీటింగ్ ప్రాంగణానికి కాకతీయ అని.. భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంగా పేర్లు నిర్ణయించారు. మీడియా హాలుకు షోయబుల్లా ఖాన్, అతిథులు బస చేసే ప్రాంతానికి సమ్మక్క-సారలమ్మ నిలయంగా నామకరణం చేశారు. ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరు.. కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసుగా పేరు పెట్టారు. భాజపా సంఘటన కార్యదర్శుల సమావేశ మందిరానికి కుమురం భీం, ఎగ్జిబిషన్​ స్థలానికి గొల్లకొండ పేరు, తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరు పెట్టారు. అతిథులకు స్వాగతం పలికే సమయంలో సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

"జాతీయ కార్యవర్గ సమావేశాలకు 18 మంది సీఎంలు వస్తారు. పండుగ వాతావరణంలో సభలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనేక అవరోధాలు కల్పిస్తోంది. తప్పుడు విషయాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మద్దతుతో సమావేశాలను విజయవంతం చేస్తాం. దేశంలోని పేదల భవిష్యత్‌కు భరోసా కల్పించే దిశగా సమావేశాలు జరుగుతాయి." - కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖమంత్రి

"మహారాష్ట్రలో పుత్ర వాత్సల్యంతో శివసేన కనుమరుగైంది. రాష్ట్రంలో తెరాస కూడా పుత్రవాత్సల్యంతో పతనమవుతుంది. తెలంగాణ ప్రజల మద్దతుతో సమావేశాలను విజయవంతం చేస్తాం."- లక్ష్మణ్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి: మీరు ఎన్నికుట్రలు పన్నినా.. సభను ఆపలేరు: కిషన్‌రెడ్డి

రాష్ట్రపతి ఎన్నికలపై పునరాలోచనలో విపక్షం!.. మమత కీలక వ్యాఖ్యలు

Last Updated :Jul 1, 2022, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.