ETV Bharat / state

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ

author img

By

Published : Jan 12, 2021, 7:15 AM IST

KTR
హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ

అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్‌ మరోసారి తన సత్తాను చాటుకుంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రసిద్ధ బీమా, ఆర్థిక సేవల సంస్థ మాస్‌ మ్యూచువల్‌(మసాచుసెట్స్‌ మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ) హైదరాబాద్‌లో రూ.వేయి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ నిధులతో ప్రపంచస్థాయి సామర్థ్య కేంద్రం (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా ఆవల తాము ఏర్పాటు చేస్తున్న తొలి కేంద్రం ఇదేనని తెలిపింది.

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఆర్థిక జిల్లా (ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌)లో లక్షా యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించనున్న ఈ కేంద్రంలో 300 మంది ఉద్యోగులను ఇప్పటికే నియమించినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో సోమవారం నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో మాస్‌ మ్యూచువల్‌ వివరించింది. దీనిపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సంస్థకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సమావేశంలో మాస్‌ మ్యూచువల్‌ భారత విభాగాధిపతి రవి తంగిరాల, సంస్థ ప్రధాన సాంకేతిక విభాగాధిపతి ఆర్థర్‌ రీల్‌ తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు

ఈ సందర్భంగా రవి తంగిరాల మాట్లాడుతూ..‘‘హైదరాబాద్‌లో మా సంస్థ ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది. 170 సంవత్సరాల వాణిజ్య, వ్యాపార చరిత్ర కలిగిన మాస్‌ మ్యూచువల్‌.. ఫార్చ్యూన్‌ 500 సంస్థల జాబితాలో 89వ స్థానంలో ఉంది. 1851 నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆర్థిక సేవలను అందిస్తోంది. మాస్‌ మ్యూచువల్‌ సంస్థ అమెరికా ఆవల సామర్థ్య కేంద్రం ఏర్పాటు కోసం ప్రపంచంలోని వివిధ నగరాలను పరిశీలించాం. 2019 అక్టోబరులో హైదరాబాద్‌కు వచ్చి కేటీఆర్‌, అధికారుల బృందంతో చర్చించాం. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, సహాయసహకారాలు, చక్కటి మౌలికవసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటు ఉండడం వంటి సానుకూతల దృష్ట్యా హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రారంభ పెట్టుబడి రూ.వేయి కోట్లతో పాటు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉంది. హైదరాబాద్‌ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో సంస్థ కార్యకలాపాలను, ఇతర రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సంస్థ లక్ష్యాలు, అవసరాల మేరకు స్థానికంగా ఉన్న ప్రతిభావంతులైన యువత సహకారంతో ముందుకుసాగుతాం. వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తాం. వారి ఆర్థికాభివృద్ధికి సహకరిస్తాం. సంస్థ ఇంజినీరింగ్‌ డేటా సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, అప్లికేషన్స్‌, ఇతర సహాయక రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మరింత మందిని నియమిస్తాం. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు’’అని తెలిపారు. ఆర్థర్‌ రీల్‌ మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న ప్రతిభావంతులైన యువత ద్వారా సంస్థ నూతన ఆవిష్కరణలు చేపడుతుందన్నారు.

తెలంగాణకు గర్వకారణం: కేటీఆర్‌

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మాస్‌ మ్యూచువల్‌ సంస్థ అమెరికా బయట తన మొదటి కేంద్రానికి హైదరాబాద్‌ను ఎంపిక చేయడం తెలంగాణకు గర్వకారణమమన్నారు. దీని ద్వారా బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా సేవలకు నగరం ప్రసిద్ధి చెందుతుందని చెప్పారు. దీనిపై ట్విటర్‌లో స్పందిస్తూ ‘ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం లేదు. ఫార్చ్యూన్‌ 500 సంస్థల్లో ఒకటైన మాస్‌మ్యూచువల్‌ సంస్థను తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.