Chiranjeevi latest Comments: మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా మొరటుగా, కటువుగా ఉండాలన్న చిరంజీవి.. ఆ లక్షణాలు లేకపోవడం వల్లే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకోవడం తన మనసు నుంచి వచ్చింది కాదన్న చిరంజీవి.. ఆ రంగంలో మాటలు అనాలన్నా.. అనిపించుకోవాలన్నా తన సోదరుడు పవన కల్యాణ్ సమర్థుడని పేర్కొన్నాడు. పవన్ను ఏదో ఒకరోజు ఉన్నత స్థాయిలో చూసే అవకాశం వస్తుందని చిరంజీవి అభిలాషించారు.
హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన నర్సాపూర్ వైఎన్ఎంసీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ఈ వ్యాఖ్యలు చేశారు. కళాశాల అధ్యాపక బృందాన్ని, సహచార మిత్రులను ఆత్మీయంగా సన్మానించిన మెగాస్టార్.. నాటి కళాశాలలో చదివిన రోజులను గుర్తు చేసున్నారు. పాఠాల కంటే జీవిత పాఠాలను ఎలా చదవాలో వైఎన్ఎంసీ కళాశాల నేర్పించిందన్నారు. నటుడిగా క్రమశిక్షణతో ఉన్నానంటే కళాశాలలోని ఎన్సీసీ నేర్పించిన పాఠాలేనన్నారు. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ డీఎస్ ఆర్ వర్మ, గ్రంధి భవానీ ప్రసాద్తో పాటు పెద్దసంఖ్యలో నాటి మిత్రులంతా ఈ వేడుకకు హాజరై నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.
'ఎన్సీసీలో సీనియర్ కెప్టెన్ పొజిషన్ వరకు వెళ్లా. ఆ కాలేజీలోనే క్రమశిక్షణ నాకు అలవడింది. నాకు డ్యాన్స్ విషయంలో గురువులు ఎవరూ లేరు. కానీ, బెస్ట్ డ్యాన్సర్నంటూ అంతా నన్ను అంటారు. కేవలం పుస్తకాల నుంచే కాదు మన చుట్టూ ఉండే వారి నుంచీ నేర్చుకుంటూనే ఉండాలి. నా మనసుకు నచ్చితే దాని అంతు చూడటమనేది నాకు అలవాటుగా మారింది. నా మనసులోంచి రాకపోతే దాని అంతు నేను చూడలేను. అదేంటో మీకు తెలుసు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. రాజకీయాల్లో సెన్సిటివ్గా ఉంటే రాణించడం చాలా కష్టం. అవసరం ఉన్నా లేకపోయినా మాటలు అనాలి, అనిపించుకోవాలి. తను (పవన్ కల్యాణ్) తగినవాడు. అంటాడు, అనిపించుకుంటాడు. మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒకరోజు అత్యుత్తమ స్థానంలో ఉంటాడు'-చిరంజీవి
ఇవీ చదవండి: