ETV Bharat / state

సెల్లు మీదే కళ్లు: మనసు మల్లుతోంది... యమపురి పిలుస్తోంది!

author img

By

Published : Feb 16, 2021, 9:22 AM IST

కళ్లు సెల్లు మీద.. భద్రత గాల్లో..!
కళ్లు సెల్లు మీద.. భద్రత గాల్లో..!

ఏడాదికోసారి పేద, మధ్య తరగతి, సంపన్న వర్గాలు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు పర్యటనలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి సరదా యాత్రలతో సేద తీరుతుంటారు. 4-10 మంది లోపు సభ్యులైతే మినీ వ్యాన్లు, కార్లు అద్దెకు తీసుకుంటున్నారు. 20-30 మంది వరకు ఉంటే ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.

ఏడాదికోసారి పేద, మధ్య తరగతి, సంపన్న వర్గాలు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు పర్యటనలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి సరదా యాత్రలతో సేద తీరుతుంటారు. 4-10 మంది లోపు సభ్యులైతే మినీ వ్యాన్లు, కార్లు అద్దెకు తీసుకుంటున్నారు. 20-30 మంది వరకు ఉంటే ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.

కొన్ని ట్రావెల్స్‌ నిర్వాహకులు అద్దె ప్రాతిపదికన బస్సులు తీసుకుంటారు. రోజువారి వేతనంపై డ్రైవర్లను ట్రిప్పులకు పంపుతుంటారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, అనుభవం ఉన్న వారు ఎక్కువ మొత్తం డిమాండ్‌ చేస్తుండటంతో కొత్త డ్రైవర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలకు భద్రత ఉండటం లేదు. అదనంగా కిరాయి తీసుకుని అనుభవం ఉన్న డ్రైవర్లను పంపేందుకు కొద్ది మంది మాత్రమే ముందుకొస్తున్నారని ప్రైవేటు క్యాబ్‌ డ్రైవర్‌ రమణ తెలిపారు.

దూర ప్రాంతాలు, మలుపులు, ఘాట్‌రోడ్లు ఉన్న మార్గాల్లో ప్రయాణికులున్న బస్సు నడిపేందుకు ఎంతో అనుభవం, ఆ ప్రాంతాలపై పట్టు ఉండాలని ట్రావెల్స్‌ యజమాని, డ్రైవర్‌ విప్పా కల్యాణ్‌ తెలిపారు. అరకు ప్రమాద ఘటనలో డ్రైవర్‌ తప్పిదమే కారణమని ఏపీ రవాణాశాఖ అధికారులు నిర్ధరించారు. ప్రయాణికులూ డ్రైవర్‌ అనుభవ రాహిత్యం, ఘాట్‌ రోడ్లలో కిందకు వచ్చేటప్పుడు మొబైల్‌లోని జీపీఎస్‌ చూస్తూ బస్సు నడపటం ప్రమాదానికి కారణమంటూ బాధితులు ఆవేదన వెలిబుచ్చారు.

ఘాట్‌ రోడ్లలో ప్రయాణికులతో ఉన్న బస్సులను నడపటం అంత తేలిక కాదు. మనసు స్థిరంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం ముఖ్యం. ఆలోచనలు అదుపు తప్పితే స్టీరింగ్‌పై పట్టు సడలుతుంది. సెకన్ల వ్యవధిలో ఊహకందని ఘోరం జరిగిపోతుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం ఎన్నోసార్లు ప్రయాణికులను సురక్షితంగా చేర్చాను. 25 ఏళ్లుగా డ్రైవింగ్‌ చేస్తున్నా... ఇప్పటికీ ఆ మార్గంలో మలుపుల వద్ద అప్రమత్తంగా ఉంటాను. ఇంట్లో ఏదైనా గొడవ పడినా, ఒంట్లో కాస్త నలతగా ఉన్నా మా డిపో మేనేజర్‌కు ఆ రోజు డ్రైవింగ్‌ చేయలేనని చెప్పేస్తాను. అరకు ప్రమాదంలో డ్రైవర్‌ తప్పిదం ఉంది. ఇంతవరకూ ఎప్పుడూ వెళ్లని మార్గంలో వాహనం నడపడం, బాధ్యత రాహిత్యమే నలుగురు ప్రాణాలు బలి తీసుకుంది.

-ఇది ఓ ఆర్టీసీ డ్రైవర్‌ అభిప్రాయం

అనుభవం ఉన్న డ్రైవర్లకు ఎక్కువ వేతనం ఇవ్వాల్సి వస్తుందని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ ట్రాక్టర్‌ నడిపే వాళ్లను తీసుకొచ్చి బస్సు స్టీరింగ్‌ అప్పగిస్తున్నాయి. డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేక, ర్యాష్‌గా వాహనాలు నడుపుతుంటే మధ్యలోనే ప్రయాణికులు దిగిన సందర్భాలున్నాయి. సమయానికి డ్రైవర్లు దొరక్క అనుభవం లేని వారికి వాహనాలు అప్పగిస్తున్నారు. ఈ విషయం గమనించి ప్రయాణికులు ముందుగానే అప్రమత్తం కావాలి.

- ప్రైవేటు ట్రావెల్‌ నిర్వాహకుడు

అంచనా వేయటంలో విఫలం...

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, చెన్నై, గోవా ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టి వచ్చేందుకు వెళ్తుంటారు. సొంత వాహనం ఉన్న కుటుంబాలూ దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రైవేటు డ్రైవర్లను నియమించుకుంటారు. ప్రమాదకర మలుపులు, ఎత్తైన మార్గాలు, సుదీర్ఘ ప్రయాణాలలో అనుభవమే కీలకం అనే విషయంలో చాలా మందికి అవగాహన ఉండటం లేదు. చాలా మంది డ్రైవర్లు ఘాట్‌ రోడ్లను అంచనా వేయడంలో విఫలమవుతుంటారు. నిర్లక్ష్యం కూడా దీనికి జతకూడటంతో ప్రమాదాలకు కారణమవుతున్నారంటూ ఆర్టీసీ డ్రైవర్‌ ఒకరు విశ్లేషించారు.

ఇదీ చూడండి : వెంచర్ కోసం డబ్బులిచ్చారు... మోసపోయామని ట్యాంక్ ఎక్కారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.