ETV Bharat / state

బడి చేరని పుస్తకం.. ఇప్పటి వరకు సరఫరా చేసింది ఎంతంటే..?

author img

By

Published : Jun 13, 2022, 10:49 AM IST

బడి చేరని పుస్తకం.. ఇప్పటి వరకు 18 శాతమే జిల్లాలకు సరఫరా
బడి చేరని పుస్తకం.. ఇప్పటి వరకు 18 శాతమే జిల్లాలకు సరఫరా

Delay in Supply of Books to Schools : సుమారు రెండు నెలల వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు నేడు మళ్లీ తెరుచుకున్నాయి. అయితే చాలాచోట్ల సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి. పలు స్కూళ్లకు ఇంకా పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదు. ఇక భాగ్యనగరంలో అయితే ఇప్పటి వరకు కనీసం 20 శాతం పుస్తకాలూ పాఠశాలలకు చేరలేదు.

Delay in Supply of Books to Schools : వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు నేడు పునః ప్రారంభం అయ్యాయి. పుస్తకాలు లేకుండానే విద్యార్థులు పాఠాలు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరం పరిధిలోని మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు 20 శాతం పుస్తకాలూ సరఫరా కాలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆంగ్ల మాధ్యమంలోకి మారిన పిల్లలకు పుస్తకాలు అందుబాటులో లేకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 2.80 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరానికి మూడు జిల్లాలకు కలిపి 26,89,450 పుస్తకాలు అవసరమని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు 4.57 లక్షల పుస్తకాలే పాఠశాలలకు చేరుకున్నాయి.

.

విద్యార్థుల సంఖ్య పెరిగితే..
ఈసారి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టనున్న నేపథ్యంలో ఒకవైపు ఆంగ్ల పాఠాలు.. మరోవైపు తెలుగు పాఠాలు ఉండేలా ముద్రిస్తున్నారు. కాగితం కొరత కారణంగా ముద్రణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెండేళ్లుగా కరోనా పరిస్థితులు, ఆర్థిక అవస్థలతో మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాయి. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల వలసలు అధికంగా ఉంటే.. పాఠ్య పుస్తకాల సర్దుబాటు చేయడం మరింత కష్టంగా మారనుంది.

.

నెలాఖరుకల్లా అందిస్తాం.. 'పుస్తకాలను ఇప్పటికే జిల్లాల వారీగా పంపిస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి జిల్లాల డిమాండ్‌కు అవసరమైన పుస్తకాలన్నీ సరఫరా చేస్తాం.' -శ్రీనివాసాచారి, సంచాలకుడు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం

ప్రణాళిక లోపంతోనే సమస్య.. 'పాఠ్య పుస్తకాల ముద్రణ, సరఫరాలో ప్రణాళిక లోపంతో ఏటా విద్యార్థులకు సకాలంలో అందడం లేదు. జూన్‌లో పాఠశాలలు తెరుస్తారని ముందే తెలిసినా.. స్పందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. వెంటనే విద్యార్థులకు పుస్తకాలు అందించకపోతే ఆందోళన చేపడతాం.' - పి.శ్రీహరి, సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, ఏబీవీపీ

ఇదీ చూడండి.. Schools Reopened in Telangana : తెలంగాణలో బడి గంట మోగింది..

దేశంలో కాస్త తగ్గిన కొవిడ్​ కేసులు.. అయినా 8వేలకు పైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.