ETV Bharat / state

యువతకు శుభవార్త: ఆర్మీలో చేరికకు సింగరేణి ఉచిత శిక్షణ

author img

By

Published : Jan 16, 2021, 6:06 PM IST

ఆర్మీ ఎంపిక పరీక్షకు సింగరేణి వ్యాప్తంగా 11 చోట్ల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. 550 మందికి 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 20 లోపు ఎంపిక పరీక్షలు పూర్తి కానున్నాయి. గతేడాది రిక్రూట్​మెంట్​లో సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 35 మంది ఎంపికయ్యారు.

singareni-will-conduct-free-coaching-camps-for-army-recruitment-for-youth-in-singareni-district
యువతకు శుభవార్త: సింగరేణి ఆధ్వర్యంలో ఆర్మీ రిక్రూట్​మెంట్ ఉచిత శిక్షణ

ఆర్మీ రిక్రూట్​మెంట్‌ విభాగం(సికింద్రాబాద్‌) మార్చి 5 నుంచి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం... ఆసక్తి గల సింగరేణి యువతకు ప్రీ-ఆర్మీ రిక్రూట్​మెంట్‌ శిక్షణా శిబిరాలను ఈ నెల 20 నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 11 ఏరియాల్లో ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. ఆర్మీపై ఆసక్తి గల సింగరేణి యువత ఎవరైనా శిక్షణ పొందవచ్చునని సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షులు, జనరల్ ‌మేనేజర్‌ కె.రవిశంకర్‌ ప్రకటించారు.

ఏరియాలు ఇవే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ఏరియాల్లో, భూపాలపల్లి జిల్లా కేంద్రం, పెద్దపల్లి జిల్లాలో రామగుండం-1 (గోదావరిఖని), రామగుండం-2 (8 ఇంక్లైన్‌ కాలనీ), రామగుండం-3 (సెంటినరీ కాలనీ), మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్​, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు.

అర్హతలు...

18 నుంచి 21 వయసుల యువకులు, 162 నుంచి 166 సెంటి మీటర్ల ఎత్తు, 48 నుంచి 55 కేజీల బరువు కలిగి 1,600 మీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పరిగెత్తగలిగే సామర్థ్యం కలిగి ఉన్నవారు శిక్షణా శిబిరం కోసం అర్హులు. ప్రతీ ఏరియా నుంచి 50 మందిని ఎంపిక చేసి... రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శారీరక పరీక్షల్లో నెగ్గడానికి కావాల్సిన శిక్షణను ఇవ్వనున్నారు. శిక్షణ ఇవ్వడానికి సరైన అనుభవం కలిగిన వ్యక్తులను యాజమాన్యం నియమిస్తోంది. శిక్షణ కాలంలో యువకులకు పౌష్టికహారంగా కోడిగుడ్లు, పాలు, పండ్లు ఉచితంగా అందజేయనున్నారు.

వందలాది మందికి ఉద్యోగాలు

సింగరేణి ఆధ్వర్యంలో 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఏటా నిర్వహించిన ఉచిత ఆర్మీ శిక్షణా శిబిరాల వల్ల వందలాది మంది సింగరేణి ప్రాంత నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. దేశం నలుమూలల, సరిహద్దు ప్రాంతాల్లో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు.

రికార్డు స్థాయిలో...

గతేడాది ఎక్కువ మంది ఎంపికయ్యేలా కంపెనీ ప్రయోగాత్మకంగా రెసిడెన్షియల్‌ పద్ధతిలో ఆర్మీ శిక్షణా శిబిరాలను 3 చోట్ల నిర్వహించింది. 11 ఏరియాల్లో స్క్రీనింగ్‌ నిర్వహించి కొత్తగూడెం, రామగుండం-2, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో రెసిడెన్షియల్‌ క్యాంపులను 3 నెలల పాటు నిర్వహించి 329 మంది యువతకు శిక్షణ ఇచ్చింది. కరీంనగర్​లో జరిగిన ఆర్మీ రిక్రూట్​మెంట్‌ ర్యాలీలో 272 మంది పాల్గొనగా... వీరిలో 162 మంది శారీరక పరీక్షలో నెగ్గడం విశేషం. ఆ తర్వాత జరిగిన మెడికల్‌ పరీక్షల్లో 114 మంది ఉత్తీర్ణులు కాగా రాత పరీక్షలో 35 మంది పాసై ఆర్మీలో ఉద్యోగాలు పొందారు. ఒకే ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో సింగరేణి ప్రాంత యువకులు ఉద్యోగాలు పొందడం అదే తొలిసారి. ఈ ఏడాది కొవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నందున రెసిడెన్షియల్‌ తరహాలో శిక్షణను ఇవ్వడం లేదని... ఏరియాల వారీగా అన్ని చోట్ల శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని సింగరేణి స్థాయి సేవా సమితి కో-ఆర్డినేటింగ్‌ అధికారి బి.మహేశ్ తెలియజేశారు.

యువతకి మంచి అవకాశం

ఆర్మీలో చేరాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రైవేటు ఆర్మీ శిక్షణా శిబిరాల్లో పెద్ద ఎత్తున ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ సింగరేణి సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంపులను నిర్వహిస్తోంది. శారీరక పరీక్షకు అవసరమైన శిక్షణ ఇప్పించడంతో పాటు రాత పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది.

ఎవరైనా సరే...

సింగరేణి కార్మికుల బిడ్డలే కాకుండా సింగరేణి ప్రాంతాలకు సంబంధించిన యువకులు ఎవరైనా సరే ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ విషయంపై సింగరేణి ప్రాంతాల్లోని జి.ఎం. కార్యాలయాల్లో సంప్రదించవచ్చునని వెల్లడించింది.

ఇదీ చదవండి: ఆర్మీ అధికారి అరుదైన ఫీట్​.. గిన్నిస్​లో చోటు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.