Vinayaka chavithi : కోటి రూపాయల కరెన్సీతో గణేశ్ మండపం అలంకరణ

author img

By

Published : Sep 18, 2021, 8:56 AM IST

కోటి రూపాయల కరెన్సీతో గణేశ్ మండపం అలంకరణ

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగం వైభవంగా కొనసాగుతున్నాయి. మహాగణపతి విగ్రహం ఎంత అందంగా ఉండాలని కోరుకుంటారో.. ఆ విగ్రహాన్ని ప్రతిష్టించే మండపం కూడా అంతే అందంగా ఉండాలనుకుంటారు. అందుకే గణేశ్ మండపాలను చాలా అందంగా తీర్చిదిద్దుతారు. వినాయకుడు కొలువయ్యే మండపాలను చాలా ప్రాంతాల్లో వినూత్నంగా రూపొందిస్తారు. అచ్చం ఇలాగే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాన్ని నిర్వాహకులు చాలా క్రియేటివ్​గా ఏర్పాటు చేశారు. మరి అదేంటో మీరూ చూసేయండి..

కోటి రూపాయల కరెన్సీతో గణేశ్ మండపం అలంకరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి మొదలయ్యే పూజల నుంచి రాత్రిపూట భజనల వరకు భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. వినాయకుణ్ని ఒక్కోరోజు ఒక్కో రకంగా ముస్తాబు చేస్తున్నారు. పాల్వంచలోని కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహానికే కాకుండా.. మండపాన్నీ రోజుకో రకంగా అలంకరిస్తున్నారు.

శుక్రవారం రోజున లక్ష్మీదేవిని స్మరిస్తూ.. వినాయక మండపాన్ని కోటి రూపాయలు విలువ చేసే కరెన్సీ నోట్లతో అలంకరించారు. కరెన్సీ నోట్ల మధ్య మహాగణపతి అందంగా కొలువుదీరాడు. స్వామికి 108 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వినూత్నంగా ఉన్న గణేశుణ్ని చూడటానికి చుట్టుపక్కల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.

"27 ఏళ్ల నుంచి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నాం. ఎప్పుడూ మండపాన్ని వినూత్నంగా అలంకరిస్తాం. ఈ ఏడాది కూడా అలాగే చేద్దామని అనుకున్నాం. అందుకే కోటి రూపాయలు విలువ చేసే కరెన్సీ నోట్లతో మండపాన్ని, గణపతి విగ్రహాన్ని అలంకరించాం. స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా భక్తులు వస్తున్నారు."

- గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.