Congress: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు

author img

By

Published : Sep 15, 2021, 9:49 PM IST

Congress leaders  attack

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలు ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్యాలయంపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు అద్దాలను ధ్వంసం చేశారు. కార్యాలయం పైకి ఎక్కి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలో ఇవాళ కాంగ్రెస్ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. పట్టణంలో ప్రదర్శన నిర్వహించిన తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

తమ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు తెరాసలో చేరటాన్ని కార్యకర్తలు తప్పబట్టారు. తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కార్యాలయంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన ఈ దాడిని తెరాస నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు

ఇదీ చూడండి: Saidabad Rape Case: సైదాబాద్ ఘటనపై స్పందించరా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడికి పోయారు?: కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.