RIMS Super Speciality Hospital Adilabad : అధికారుల అస్పష్ట విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో ఆదిలాబాద్ రిమ్స్ యాజమాన్యం మరోసారి అపఖ్యాతిని మూటగట్టుకుంది. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం రోజే ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ రావడం, మరో ముగ్గురు డాక్టర్లు రాజీనామా చేయడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల భాగస్వామ్యంతో రూ.150 కోట్లతో నిర్మితమైన ఆసుపత్రిలో కార్డియోలాజీ, న్యూరో, పిల్లలు, పెడియాట్రిక్ విభాగంలో అత్యాధునిక సేవలను అందుబాటులోకి తేవాల్సి ఉంది.
విధుల్లో చేరకుండానే రాజీనామా
దాదాపు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులతో సోమవారం ప్రారంభించాలని రిమ్స్ యాజమాన్యం నిర్ణయించింది. కానీ ఒకరోజు ముందే న్యూరోలాజీ వైద్యుడికి కరోనా పాజిటివ్ రావడం, కార్డియోలజీ వైద్యులు విధుల్లో చేరకుండానే రాజీనామా చేయడంతో ఆసుపత్రి ప్రారంభాన్ని వాయిదా వేయగా... ఆశగా ఎదురుచూసిన వ్యాధిగ్రస్థులకు నిరాశే మిగిలింది.
మరో రెండు వారాల్లో...
'ఈ రోజు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ ప్రారంభించాలని అనుకున్నాం, కానీ అనివార్య కారణాలతో ఆగిపోయింది. ముగ్గురు వైద్యులు రాజీనామా చేయడం... మరో డాక్టర్కు కరోనా రావడంతో ఓపీ ప్రారంభాన్ని వాయిదా వేశాం. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇస్తాం. మరో రెండు వారాల్లో ఓపీ సేవలు ప్రారంభిస్తాం.' - జైసింగ్, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్
ఇదీ చదవండి : పంటపొలాన్నే కాదు.. మైదానాన్నీ దున్నేస్తారు.!