తెలంగాణలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆదిలాబాద్లో గణేశుని శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేష్చంద్ర హాజరయ్యారు.
వినాయక నిమజ్జన ప్రారంభించే ముందు ఆదిదేవుడైన గణనాథునికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ హారతినిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా వెళ్తున్న బొజ్జ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. నగరంలో పురవీధుల గుండా శోభాయాత్ర కొనసాగుతోంది. ఆయా కాలనీల్లో, కూడళ్లలో వినాయకుని శోభాయాత్ర సందడి నెలకొంది. సంప్రదాయ రీతిలో, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలతో నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిమజ్జన ఉత్సావాల్లో ఆదివాసీలు గుస్సాడీ నృత్యాలతో మైమరిపించగా.. యువతులు వారిని అనుసరిస్తూ చిందులు వేస్తూ తన్మయత్వం పొందారు. మరోవైపు భజనలు, మేళాతాళాల నడుమ యువత కేరింతలు కొడుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు.
ఇదీ చూడండి: Khairatabad Ganesh: జలప్రవేశం చేసిన ఖైరతాబాద్ మహారుద్ర గణపతి