ETV Bharat / state

Flood Effect: కుండపోత వర్షం... పంటలకు తీరని నష్టం

author img

By

Published : Jul 24, 2021, 7:00 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గంటకోసారి అన్నట్లుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 58,981 ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా తేల్చింది.

Flood Effect: కుండపోత వర్షాలు... పంటలకు తీరని నష్టం
Flood Effect: కుండపోత వర్షాలు... పంటలకు తీరని నష్టం

ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పంటలకు మొలక దశలోనే నష్టం వాటిల్లుతోంది. ఖరీఫ్‌ ఆరంభంలో అనుకూలంగా ఉన్నాయనుకున్న వానలు... ఇప్పుడు ఉగ్రరూపం దాల్చడంతో రైతులకు శరాఘాతంగా మారింది. కుమురంభీం జిల్లాలో 43,601 ఎకరాల్లో పంటలు నీటమునగాయి.

వరద పాలైన పంట

ఆదిలాబాద్‌ జిల్లాలో మరో 15,380 ఎకరాల్లో పంట వరద పాలైంది. ప్రధానంగా వాంకిడి, ఆసిఫాబాద్‌, దహేగాం, కాగజ్‌నగర్‌, తిర్యాణి, నేరడిగొండ, బోథ్‌, సిరికొండ, బజార్‌ హత్నూర్‌, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ మండలాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. వరదల ఉద్ధృతికి గుట్టలు, పొలాలు కోతకు గురవడం వల్ల పంట చేలల్లోకి భారీగా నీరు చేరింది. కొన్ని చోట్ల ఇసుక మేటలు పెట్టడం.. నష్టానికి కారణమైంది.

ఈ రెండు మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు మా పంట అంత వరద పాలైంది. మాకు రెండున్నర భూమి ఉంది. అందులో పంటకు 75వేల వరకు ఖర్చు చేశాం. అదంతా నీటి పాలైంది. ఈసారి వర్షాలు మస్తు పడ్డాయి.

- భిక్షు, రైతు, ఆదిలాబాద్‌ జిల్లా

మా పంట అంతా వరదకు కొట్టుకుపోయింది. పంట నీటమునిగింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇట్లాంటి వర్షం ఎప్పుడూ పడలేదు. బ్యాంకులో లోన్ తీసుకున్నా... ఎట్లా కట్టాలో అర్థం కావట్లేదు.

-గణేష్‌, రైతు, ఆదిలాబాద్‌ జిల్లా

అత్యధికంగా వర్షాపాతం నమోదు

ఆశాజనంగా ఉన్న పంటలతో ఆనందంగా ఉన్న రైతులకు... అధిక వర్షాల రూపంలో ఊహించని ఉపద్రవం ఎదురైంది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో రెండు రోజుల కిందట రాష్ట్రంలోనే అత్యధికంగా 36.15.సెం.మి. వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్‌లో 31.48.సెం.మి, బోథ్‌ మండలంలో 13.16.సెం.మి, నేరడిగొండ మండలంలో 12.12. సెం.మి. చొప్పున వర్షపాతం నమోదైంది. ప్రధానంగా నదీ పరివాహాక ప్రాంతాల్లో భారీగా నష్టం జరిగింది. వ్యవసాయమే తప్పా... మరో ఆదాయం లేని తమను ప్రభుత్వం ఆదుకోవాలనే వేడుకోలు రైతుల నుంచి వస్తోంది.

వ్యవసాయ శాఖలో కనిపించని కదలిక

రాష్ట్రంలోనే అత్యధిక వరదలు ఉగ్రరూపం దాల్చిన నిర్మల్‌ జిల్లా వ్యవసాయశాఖలో కనీస కదలిక కనిపించడం లేదు. నష్టం వివరాలను తెలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. భైంసా, కుంటాల, దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌, సారంగపూర్‌ మండలాల్లో భారీగా నష్టం జరిగినప్పటికీ ఇంతకవరకు... ఆ శాఖాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.