ETV Bharat / state

లక్ష జనాభాకు ఏటా తిప్పలు.. ఏళ్లుగా రవాణాకు ఇబ్బందులు

author img

By

Published : Jul 21, 2020, 4:47 PM IST

సాధారణంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తే పంటలు సాగు చేయవచ్చని అన్నదాతలు... భూగర్భజలాలు వృద్ధి చెంది నీటి ఎద్దడి దూరమవుతుందని పట్టణవాసులతో పాటు తండావాసుల వరకు సంబురపడుతుంటారు. ఇందుకు భిన్నంగా గంటపాటు వర్షం ఏకధాటిగా కురిస్తే చాలు జిల్లాలో వందలాది గ్రామస్థుల్లో వణుకు మొదలవుతుంది. వర్షం తమను బాహ్యప్రపంచంతో దూరం చేసి అవస్థలపాలు చేస్తుందని మదనపడుతుంటారు. వాగులపై ఉన్న లోతట్టు వంతెనలు.. ఆ మాత్రం లేని వంతెనలు లేకపోవడమే వారి భయానికి ఆందోళనకు కారణమవుతున్నాయి. జిల్లాలో ఒకటి కాదు రెండు ఏకంగా 50కిపైగా చోట్ల రాకపోకలకు వాగులు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాకాలంలో ఆయా గ్రామాల్లో విపత్తుల నివారణ చర్యలు కత్తి మీద సాముగా మారాయి.

లక్ష జనాభాకు ఏటా తప్పని తిప్పలు.. ఏళ్లుగా రాకపోకలకు ఇబ్బందులు
లక్ష జనాభాకు ఏటా తప్పని తిప్పలు.. ఏళ్లుగా రాకపోకలకు ఇబ్బందులు

ఆదిలాబాద్‌ జిల్లాలో 467 పంచాయతీ ఉండగా.. 508 రెవెన్యూ గ్రామాలు.. మరో వందకు పైగా ఆవాసప్రాంతాలు ఉన్నాయి. జిల్లా మొత్తం జనాభా ఏడు లక్షలపైగా జనాభా ఉండగా.. వర్షాకాలంలో లక్షమంది జనాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వాగులు, వరదలు వచ్చినపుడు వారికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే మాత్రం దేవుడిపై భారం వేయడం లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవడం వంటి ఘటనలు ఏటా చోటు చేసుకుంటున్నాయి.

విపత్తు నిర్వహణ ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్‌శాఖ విభాగం వారు 76 వాగుల వద్ద, ఆర్‌అండ్‌బీ శాఖ విభాగం వారు 26చోట్ల వాగులు ఉప్పొంగిపుడు రవాణా స్థంబిస్తుందని తమ నివేదికల్లో స్పష్టంచేశారు. ఆయా వాగుల వద్ద వరద ఉధ్ధృతి సమయంలో గంట, రెండు గంటలు .. మరి ఎక్కువైతే ఒకరోజు రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. అదే వాగుల ఉధ్ధృతి తగ్గకపోయినా.. వంతెనలు కోతకు గురైనా అక్కడ రాకపోకలకు నెలల తరబడి అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంటోంది. లోతట్టు వంతెనల స్థానంలో పెద్ద వంతెనలు నిర్మించడం.. వంతెనలు లేని చోట ఆ సౌకర్యం కల్పించడం తప్పా తామేమి చేయలేమని అధికారులు చెబుతున్నారు.

అక్కడ వరదొస్తే.. అవస్థలే..

ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులు, వంకలపై లోతట్టు వంతెనలు, కొన్నివాగులపై అసలే వంతెనలు లేని కారణంగా వరద వచ్చినపుడు రాకపోకలకు అవాంతరాలు తప్పడం లేదు. జిల్లాలోని 18 మండలాల్లోని ఆదిలాబాద్‌ అర్బన్‌, మావల మండలం మినహా మిగిలిన 16 మండలాల్లో ఆయా వాగులు ఉప్పొంగినపుడు జనజీవనం స్థంబిస్తోంది. జిల్లాలో ఆయా వాగుల కారణంగా లక్షమంది ఏదో ఒక సందర్భంలో అవస్థలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో..

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలో బంగారుగూడ, అనుకుంట, లోకారి, దహిగూడ, కచ్‌కంటి, అంకాపూర్‌, జండాగూడ, టేకిడిగూడ, రాములుగూడ, యశ్వంత్‌గూడ, శివఘాట్‌, లోహర, ఖానాపూర్‌ గ్రామాల పరిసరప్రాంతాల వారు వాగులు ఉప్పొంగినపుడు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆయా వాగులు పొంగినపుడు పదుల సంఖ్యలో గ్రామాలకు, వేలాది మందికి ఇక్కట్లు తప్పడంలేదు.

● బేల మండలం దుబ్బగూడ-ఎస్‌, టేమిరిగూడ, సహజ్‌తాండ, మణియర్‌పూర్‌, దహెగాం, జైనథ్‌ మండలం పార్డి-కె వాగులొస్తే ఇబ్బందులే.

బోథ్‌ నియోజకవర్గంలో..

సిరికొండ మండలం పాలవాగు, నారాయణపూర్‌, కన్నాపూర్‌ తాండ, ఇచ్చోడ మండలం ముక్రా-కె, నేరడిగొండ మండలం సావర్గాం వాగు ఉప్పొంగితే బుగ్గారం-కె, బుగ్గారం-బి, పట్‌పటి తండా, కుంటాల-కె, కుంటాల-బి, వెంకటాపూర్‌, వాగ్దారి, మాట్లుద్ది, గోవింద్‌పూర్‌ తదితర 20 గ్రామాలు బాహ్యప్రపంచానికి దూరమవుతాయి. గాజిలి, గాంధారి, రాజులతాండ, ఏసుగూడ, రేంగన్‌వాడీ, లక్ష్మిపూర్‌ వంటి మరో 10 గ్రామాలు వాగుల ఉద్ధృతితో రాకపోకలు సాగవు.

బజార్‌హత్నూర్‌ మండలం అనంతపూర్‌, టెంబి, దేగాం, జల్లుగూడ, తలమడుగు మండలం కప్పర్‌దేవి, బరంపూర్‌, తలమడుగు, గుడిహత్నూర్‌ మండలం న్యూసోమార్‌పేట్‌, బెల్లూరి, గుడిహత్నూర్‌, లింగాపూర్‌, తోషం, దర్మగూడ, మామిడిగూడ, గోండుగూడ, తాంసి మండలం టేకిడిగూడ, భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి, వడూర్‌, దనోర, నిపాని, సంటర్‌సాంగి, అంతర్గాం గ్రామాల వద్ద వాగులు రాకపోకలకు అడ్డంకిగా మారాయి.

ఇలాంటి వాగులు ఎన్నో..!

ఇటీవల కురిసిన వర్షాలకు నేరడిగొండ మండలం సావర్గాం గ్రామం వద్ద లోతట్టు వంతెనపై నుంచి వాగు పారింది. సుమారు 15 గ్రామాలకు ఈ వాగుతో గంటసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే మాత్రం ప్రాణాలకు భరోసా ఉండదు.

నలుగురి ప్రాణాలు పోయేవి..!

బజార్‌హత్నూర్‌ గ్రామ పొలిమేరలోని వాగు ఉప్పొంగి ఆ వాగులో ఎడ్లబండితో సహా నలుగురు కొట్టుకుపోయిన ఘటన ఇటీవల కలకలం రేపింది. లోతట్టు వంతెనపై నుంచి నీరుపారడం వల్ల ఏమి కాదనుకుని దాటితే స్థానికుల సహాయంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

రాకపోకలకు అడ్డంకి ..!

భీంపూర్‌ మండలంలోని సంటర్‌సాంగి గ్రామ సమీపంలోని లోతట్టు వంతెన ద్వారా మహారాష్ట్రలోని మాండ్వికి వెళ్తారు. జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రవాసులతో పాటు మండలంలోని 26 పంచాయతీల్లో 23 పంచాయతీల ప్రజలు ఇదే దారి గుండా రాకపోకలు సాగించాల్సిందే. భీంపూర్‌ మండలవాసులతో పాటు మహారాష్ట్ర వాసులను కలుపుకుంటే సుమారు 30వేల మంది ఈ వాగు ఉప్పొంగితే బాహ్యప్రపంచానికి దూరంగా ఉంటారన్నమాట.

ఇదీ చూడండి: 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్​ నిర్మించాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.