ETV Bharat / sports

ఒలింపిక్స్​లో పీవీ సింధుకు కాంస్యం

author img

By

Published : Aug 1, 2021, 5:30 PM IST

Updated : Aug 1, 2021, 7:27 PM IST

PV SINDHU
పీవీ సింధు

17:29 August 01

చైనా షట్లర్​పై అద్భుత విజయం

PV SINDHU
పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు మెరిసింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటింది. చైనాకు చెందిన బింగ్జియావోపై ఆది నుంచీ దూకుడుగా ఆడిన సింధు.. తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ నుంచే సింధు ఆధిపత్యం కొనసాగింది. పదునైన స్మాష్‌లతో విరుచుకుపడిన హైదరాబాద్‌ షట్లర్‌.. తొలుత 5-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా మళ్లీ పుంజుకున్న సింధు.. తొలిగేమ్‌ను 21-13తో గెలుచుకుంది.

రెండో గేమ్‌ కూడా ఆసక్తికరంగా సాగింది. బెంగ్జియావో హోరాహోరీగా పోరాడటం వల్ల మ్యాచ్‌ నువ్వానేనా అన్నట్లు సాగింది. పదునైన షాట్లు, సరైన ప్లేస్‌మెంట్స్‌తో సింధు వరుసగా పాయింట్లు సాధించింది. ఒక దశలో 10-8 స్కోరుతో హోరాహోరీగా సాగుతున్న రెండో గేమ్‌లో సింధు ఒక్కసారిగా పైచేయి సాధించింది. 18-14తో ముందంజ వేసిన సింధు.. అదే జోరుతో రెండో గేమ్‌ను 21-15 తేడాతో కైవసం చేసుకుని కాంస్య పతకం దక్కించుకుంది. సింధు దూకుడుతో కేవలం 52 నిమిషాల్లోనే  మ్యాచ్‌ ముగిసింది.

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధుకు విశ్వక్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు రికార్డు సాధించింది. ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా ఈమె నిలిచింది.  

అంతకుముందు వరసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారతీయవ్యక్తిగా రెజ్లర్ సుశీల్ కుమార్‌ రికార్డు సృష్టించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సుశీల్‌... 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు

ఇది చదవండి: సింధుకు ఒలింపిక్ పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రశంసలు

Last Updated :Aug 1, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.